జగన్ కు కరోనా చేసిన సాయం- విద్యుత్ సంస్ధలకు షాక్ - అదనంగా విరాళాలు...
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చడమంటే ఏమిటో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి అర్ధమవుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చున్న విద్యుత్ ఒప్పందాల సమీక్షకు విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ వాటిపై ముందుకెళ్లలేకపోయారు. కానీ ఇప్పుడు కరోనా విపత్తు కారణంగా సదరు ఒప్పందాలను పక్కనబెట్టేందుకు ప్రభుత్వానికి అద్భుతమైన అవకాశం దొరికింది. ఒప్పందాల్లో పొందపరిచిన కొన్ని నిబంధనలే ఇందుకు వీలు కల్పిస్తున్నాయి.
విద్యుత్ ఒప్పందాల సమీక్ష..
గతేడాది ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు తెరదీసింది. అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టుల్లో అవినీతి, ఎక్కువ చెల్లింపులు జరిగినవి ఉంటే వాటిని సమీక్షించడం. దీంతో నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు విద్యుత్ ప్రాజెక్టులపైనా ప్రభుత్వం కన్నుపడింది. టీడీపీ హయాంలో సౌర, పవన విద్యుత్ సంస్ధలకు భారీగా యూనిట్ రేట్లు పెంచి కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి సమీక్షకు తెరలేపింది.
అడుగడుగునా అడ్డంకులు..
ఏపీలో విద్యుత్ ఒప్పందాల సమీక్షకు వైసీపీ ప్రభుత్వం తెరదీసిందనే కానీ అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్ధితి. ఓవైపు న్యాయపోరాటం, మరోవైపు కేంద్రం ఒత్తిళ్ల మధ్య ఒప్పందాల సమీక్ష అస్సలు సాధ్యం కాలేదు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు రేట్లు తగ్గించాలని నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చేసుకున్నారు. విద్యుత్ సంస్ధల నుంచి కొనుగోళ్లు చేయాల్సిందేనంటూ కోర్టు కూడా తేల్చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ఒప్పందాలను ఏదో రకంగా అమలు చేస్తూ వచ్చారు.
కరోనా చేసిన సాయం..
గతంలో విద్యుత్ ఒప్పందాల సమీక్ష కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై చేతులెత్తేసిన పరిస్దితుల్లో కరోనా విపత్తు వైసీపీ ప్రభుత్వానికి కలిసివచ్చింది. అప్పటికే ఒప్పందాల అమలు చేయకుండా తప్పించుకునేందుకు ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి అధికారులు తీపికబురు చెప్పారు. విపత్తుల సమయంలో ఒప్పందాలు అమలు చేయకుండా ప్రభుత్వాలకు మినహాయింపు ఇచ్చేలా ఫోర్ మెజర్ నిబంధన ఉందన్న విషయాన్ని సర్కారు చెవిలో వేయడం, దాన్ని వెంటనే అమల్లో పెట్టమని ఆదేశాలు రావడం జరిగిపోయాయి.
దీంతో ఇప్పుడు డిస్కమ్ ల నుంచి ఫోర్ మెజర్ నిబంధనను కారణంగా చూపుతూ ఒప్పందాలు అమలు చేయబోమని విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు నోటీసులు వెళుతున్నాయి.
Recommended Video
అదనంగా విరాళాలు కూడా..
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలును ప్రభుత్వం పక్కనబెట్టేసిన నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న విద్యుత్ సంస్ధలు క్రమంగా దారికొస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. కరోనా వైరస్ పై పోరు కోసం ప్రభుత్వానికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ప్రధాన ఉత్పత్తి దారైన గ్రీన్ కో ఎనర్జీ వంటి సంస్ధలు కూడా ముందుకు రావడాన్ని గమనిస్తే జగన్ సర్కారుకు మరో ఊరట లభించిందని చెప్పక తప్పదు. అయితే ఇదెంత కాలం అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.