నిమ్మగడ్డను తొలిగించాల్సిందే..పట్టువదలని జగన్: చట్టం ఏం చెబుతోంది: ఆ ఒక్కటే మార్గమా..సాధ్యమేనా..!
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఆయనను చంద్రబాబు నియమించారని..ఆయన సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి అని..చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా విచక్షణ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలంటూ నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే గవర్నర్ సైతం రమేష్ కుమార్ తో తన నిర్ణయం వెనుక కారణాలను వివరించారు. అయితే రమేష్ కుమార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం జగన్ ఏం చేయబోతున్నారు..? జగన్ మదిలో ఏముంది.. ?అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ ను తప్పించటం సాధ్యపడుతుందా.. కేంద్రం సహకరిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చకు కారణమైంది.
మంత్రులు..సీనియర్లతో సీఎం చర్చలు..
కరోనా కారణం చూపుతూ కనీసం మాట అయినా చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం పైన ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారు. ఒక వైపు ఎన్నికలను వాయిదా వేస్తూనే..మరో వైపు అధికారుల పైన చర్యలు తీసుకోవటాన్ని ముఖ్యమంత్రి తప్పుబడుతున్నారు.గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన ముఖ్యమంత్రి అవసరమైతే మరింత ముందుకు వెళ్తామని స్పష్టంగా చెప్పారు.
ఇప్పటికే గవర్నర్ తో రమేష్ కుమార్ సమావేశమై ఎన్నికల వాయిదాకు కారణాలను వివరించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. మంత్రులూ అదే వాదన కొనసాగిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ పైన చర్యలు తీసుకొనే అధికారం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. దీంతో..కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రక్రియ వైసీపీ మొదలు పెట్టింది. గవర్నర్ సైతం ఏపీలో పరిణామాల పైన ఇప్పటికే ప్రాధమిక నివేదిక కేంద్రానికి పంపారని తెలుస్తోంది. ఇదే సమయంలో సీనియర్ మంత్రులతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పని చేసిన రమాకాంత్ రెడ్డితోనూ సీఎం జగన్ మంతనాలు జరిపారు.
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్న వైసీపీ
రాజ్యంగ బద్ద సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తిని తొలిగించటం పైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. దీని కారణంగానే ఇప్పటికే కేంద్రంతో వైసీపీ ఎంపీలు మంతనాలు మొదలు పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా దాదాపుగా సమాన హోదా కలిగిన ఎన్నికల కమిషనర్ పైన వైసీపీ నేతలు ప్రయోగిస్తున్న పదజాలం కూడా ఇప్పుడు వివాదస్పదంగా మారుతోంది. ఒక దశలో ఆయన తనంతటగా తాను రాజీనామా చేయాలంటూ ఎన్నికల కమిషనర్ ను ఉద్దేశించి వైసీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానించారు.
అదొక్కటే ఇప్పుడున్న మార్గమా..
ఇక, ఎన్నికల కమిషనర్ ను తొలిగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం ఆయనను అభిశంసించటం. అందు కోసం ఏపీ శాసనసభలో ఆయన పైన అభిశంసన తీర్మానం పెట్టి..మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మండలి వ్యవహారం పైన వివాదం నడుస్తోంది. దీనిని అమలు చేయాలంటే అసెంబ్లీని సమావేశ పర్చాల్సి ఉంటుంది. అయితే, మండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా..ఇంకా కేంద్రం తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లుగా అభిశంసనకు సిద్దమైనా..మండలిలో టీడీపీ మరోసారి మూడు బిల్లుల తరహాలో అడ్డుపడే అవకాశం ఉంది.
Recommended Video
కేంద్రం సహకరిస్తుందా..
ఇక, ఎన్నికల కమిషనర్ ను ఎలాగైనా తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోతే..వారికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఆభిశంసన ఒక్కటే కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మండలి లో మూడు బిల్లులకు అడ్డు పడటంతో ఏకంగా మండలిని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం..ఇప్పుడు ఎన్నికల కమిషనర్ పైన అభిశంసన వంటి నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాల స్పందన..ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందనే మీమాసం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఇవన్నీ పక్కన పెట్టి..తాము అనుకున్న విధంగా ఏపీ ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళ్లినా..కేంద్రంలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం..వైసీపీ వాదనకు మద్దతు లభిస్తుందని హామీ వచ్చిన తరువాతనే ఏపీ ప్రభుత్వ ఇంత కీలక అంశం అమలు దిశగా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, ఎన్నికల కమిషనర్ విషయం లో మాత్రం సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి ఏ రకమైన కార్యాచరణకు సిద్దం అవుతారనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.