అమరావతి వివాదంలో కొత్త ట్విస్ట్: గెజెట్ అందుకే ఇవ్వలేదా: తాజా కమిటీ..నేడే చివరి రోజు..!
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేదా. జగన్ ప్రభుత్వం ఆలోచన ఏంటి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభిప్రాయ సేకరణకు నేడే చివరి రోజు. కమిటీ ఎటువంటి సిఫార్సులు చేయనుంది. అమరావతికి కేంద్రం గుర్తింపు లేదు. అదే సమయంలో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం సీనియర్ ఐఏయస్ జీఎన్ రావు తో సహా నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే పలువురు అభిప్రాయాలు సేకరించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, ఇంతకీ ఈ గెజిట్ వ్యవహారం ఏంటి. చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగింది...
అమరావతికి గుర్తింపు లేదా...
ఏపి నూతన రాజధానిగా అమరావతికి ఇప్పటి వరకు అధికారికంగా గుర్తింపు లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్ లోనూ ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించ లేదు. జమ్ము కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత కేంద్రం మ్యాప్ లో ఆ రెండింటినీ చేరుస్తూ భౌగోళిక మ్యాప్ లు విడుదల చేసింది. 2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన ఏపీ రాజధాని అమరావతిని ఎందుకు కేంద్రం గుర్తించ లేదనే ప్రశ్నలకు అందుకు చెబుతున్న సమాధానం ఒక్కటే. స్థానిక ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ జారీ చేయలేదు. దీంతో.. కేంద్రం సైతం గుర్తించలేదు. అయితే, అసలు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే అనుమానం స్వయంగా మంత్రులే కలిగించారు.
గెజిట్ ఎందుకు ఇవ్వలేదంటే..
వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకే అంశం మీద ప్రస్తావిస్తోంది. అయితే, చంద్రబాబు తో సహా ఆయన కేబినెట్ లో మంత్రులుగా పని చేసిన వారెవరూ దీనికి మాత్రం సమాధానం చెప్పటం లేదు. అయితే, అంతర్గతంగా మాత్రం దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగినట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేస్తే..రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. గెజిట్ విడుదల చేస్తే...హైదారాబాద్ పైన ఉన్న హక్కులను పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందనే అంచనాతో..గెజిట్ విడుదల చేయలేదని సమాచారం. కానీ, అమరావతిని ఏపీ నూతన రాజధానిగా ప్రకటించటం ద్వారా..హైదారాబాద్ మీద హక్కులు..ఏపీ ప్రజలకు నష్టం అనేది అర్దరహితమని ప్రభుత్వంలోని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కమిటీ రిపోర్ట్ ఏం చెబుతోంది..
జీఎన్ రావు కమిటీ ఈ రోజుతో ప్రజాభిప్రాయ సేకరణ ముగించనుంది. ఇక, కమిటీ సభ్యులు నివేదిక రూపొందించటం మీద ఫోకస్ పెట్టనున్నారు. కమిటీ నివేదికలో రాజధాని కొనసాగింపు..అక్కడ నిర్మాణాల అంశంలో చేసే సూచనలు..అధికార వికేంద్రీకరణ కీలకంగా మారనున్నాయి. అయితే, కమిటీ రాజధాని గా అమరావతిని కొనసాగించమని చెప్పినా..అక్కడ వద్దని చెప్పినా..ప్రభుత్వం ఆ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవటం అంత సులువైన విషయం కాదు.
అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయటంతో రాజకీయంగా ప్రయజనం కలుగుతుంది. కానీ, రాజధాని మార్పు విషయంలో ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా..రాజకీయంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో..అసలు ఇప్పుడు కమిటీ ఎటువంటి నివేదిక ఇస్తుంది..ప్రభుత్వం ఆ నివేదిక పైన ఏ రకంగా స్పందిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారుతోంది.