ఆదానీకి జగన్ మరో బంపరాఫర్..!!? 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు : ప్రభుత్వం అనుమతి..!!
ఏపీలో అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఆదానీ గ్రూపు ఇప్పుడు రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో ప్లాంట్ల ఏర్పాటుక ఒకరికే కాకుండా.. నాలుగైదు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆదానీ గ్రూపుకు ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్లాంట్ ఏర్పాటుకు జాతీయ సౌర విద్యుత్ కార్పోరేషన్ కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వ్యూహాత్మకంగా ఏపీ ప్రభుత్వ అడుగులు
అది కేంద్ర ప్రభుత్వ సంస్థ.దీని కోసం గతంలో తాను సొంతంగా పిలిచిన సౌర విద్యుత్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ టెండరును రెండేళ్ల కిందటే అదానీ సంస్థ దక్కించుకుంది. దీంతో.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు పరోక్షంగా..రానున్న రోజుల్లో నేరుగా ఆ సంస్థకే దక్కే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అవసరానికి మించి సౌర, పవన విద్యుత్తును ప్రోత్సహిస్తోందంటూ నాడు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఏపీ ప్రభుత్వం కొత్త టెండర్ల ద్వారా
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 6600 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో 3300 మెగావాట్ల సామర్థ్యం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు, మరో 3వేల మెగావాట్ల సామర్థ్యం అదానీ సంస్థకు దక్కాయి. మిగిలిన స్వల్ప మొత్తం సామర్థ్యంతో ప్లాంట్లు పెట్టే అవకాశాన్ని మరో రెండు సంస్థలు దక్కించుకున్నాయి. దేశంలో భారీగా సౌర విద్యుత్ ఉత్పత్తికి సెకీ 2019 జూన్లో టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో అదానీ పవర్ విజేతగా నిలిచింది. ఒక యూనిట్ విద్యుత్ రూ.2.93 పైసలకు సరఫరా చేయడానికి ఈ టెండర్లలో అంగీకారం కుదిరింది.
మంత్రివర్గ భేటీకి ముందు కీలక నిర్ణయం
విద్యుత్ సంస్థల ద్వారా కొనుగోలు ఒప్పందం కుదురుస్తామని 'సెకీ' తొలుత చెప్పింది. అయితే... సౌర విద్యుత్ ధరలు భారీగా పడిపోతున్న సమయంలో ఈ ధరకు దీర్ఘకాలం కొనుగోళ్లు జరిపేందుకు ఏ రాష్ట్రమూ ఒప్పుకోదన్న అనుమానంతో కొనుగోలు ఒప్పందంపై వెనక్కి తగ్గింది.మంత్రివర్గ సమావేశానికి సరిగ్గా ఒకరోజు ముందు... అంటే ఈ నెల 15వ తేదీన 'సెకీ' ఏపీ ప్రభుత్వ ఇంధన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టదల్చిన సౌర విద్యుత్ ప్లాంట్లను తమ ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
తాము ఖరారు చేసిన టెండర్ ధరను కూడా ఒక యూనిట్ రూ.2.49 పైసలకు తగ్గిస్తామని, తయారీ విధానంతో ముడిపడిన ఈ ప్లాంట్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుందని ఆ లేఖలో పేర్కొందని సమాచారం. సెకీ విజ్ఞప్తి మేరకు ఆ సంస్థ ప్రతిపాదించిన మార్గంలో రాష్ట్రంలో తొమ్మిది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి అంగీకరిస్తూ తీర్మానం చేసింది. అలాగే... 6600 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు సొంతంగా పిలిచిన టెండర్లను రద్దు చేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆదానీ గ్రూపుకే దక్కేలా
ఈ టెండర్ల రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టు డివిజన్ బెంచి ముందు వేసిన అప్పీలును కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. సెకీ పిలిచిన టెండర్లలో అదానీ గ్రీన్ పవర్ ఇప్పటికే విజేతగా నిలిచి ఉన్నందున, రాష్ట్రంలో 9వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఆ సంస్థకే దక్కనుంది. అయితే... దీనికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదం తెలపాలి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే సుముఖంగా ఉన్నందున ఈఆర్సీకి అభ్యంతరం ఉండదని, అన్నీ సాఫీగా జరిగిపోతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.