ఒడిశాలో ఏపీ పంచాయతీ ఎన్నికలు- సుప్రీంలో కోర్టు ధిక్కార పిటిషన్- ప్రతివాదుల్లో నిమ్మగడ్డ
ఏపీలో జరుగుతున్న నాలుగు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలపై వైసీపీ సర్కారుకూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో పొరుగున ఉన్న ఒడిశా సర్కారు వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ కలకలం రేపుతోంది. తమ భూభూగంలో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని ఆక్షేపిస్తూ నవీన్ పట్నాయక్ సర్కారు ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే ఇందుకు కారణం.
ఒడిశాలో ఎన్నికలు నిర్వహించిన ఏపీ
ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండో విడతకు చేరుకుంది. తొలి విడతలో ఎన్నికలు నిర్వహించిన గ్రామాల్లో పరిస్ధితులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించిన గ్రామాల్లో ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిపై ఎప్పటి నుంచో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుడా ఏపీ ఎస్ఈసీ ప్రభుత్వ సాయంతో ఓ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేసింది. దీనిపై ఇప్పుడు కొత్త వివాదం రగులుతోంది.
సుప్రీంలో ఒడిశా కోర్టు ధిక్కార పిటిషన్
విజయనగరం జిల్లా సాలూరుకు పొరుగున ఉన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టంగి తాలూకా పరిధిలో ఉన్న మూడు పంచాయతీల పేర్లు మార్చి ఎన్నికలు నిర్వహించడంపై అక్కడి నవీన్ పట్నాయక్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే అభ్యంతరంతో సుప్రీంకోర్టులో ఒడిశా సర్కారు ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని, తమ భూభాగంలో ఎన్నికలు నిర్వహించిందని పిటిషన్లో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది.త్వరలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించనుంది.
1968 నాటి కొరియా గ్రామాల వివాదం
ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లాకు పొరుగున ఉన్న ఒడిశాలోని కొరాపూట్ జిల్లాలో 21 గ్రామాలు ఉన్నాయి. వీటిని కొరియా గ్రామాలుగా పిలుస్తారు. ఈ గ్రామాల్లో ఏపీ అక్రమంగా చొరబడుతుందని 1968లో అప్పటి ఒడిశా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు అప్పట్లో యతాతథ స్ధితి కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.
ఆ తర్వాత 2006లో ఒడిశా పిటిషన్ను కొట్టేసింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారం అయ్యేవరకూ ఆయా గ్రామాల్లో యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏపీ మాత్రం ఆ 21 గ్రామాలను తమ భూభాగంలో చేర్చుకుని, పేర్లు మార్చి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఒడిశా సర్కారు కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆరోపించింది.
ఒడిశా గ్రామాలకు ఏపీ మార్చిన పేర్లు ఇవే
ఒడిశాలోని గంజాయ్ పదర్ గ్రామం పేరును గంజాయ్ భద్రగా, ఫట్టు సెనరీ గ్రామాన్ని పట్టు చెన్నూరుగా, ఫగు సెనరీ పేరును పగులు చెన్నూరుగా పేరు మార్చి ఏపీ ఎన్నకలు నిర్వహిస్తున్నట్లు ఒడిశా సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. గతంలో ఇవే గ్రామాల్లో తాము ఎన్నికలు నిర్వహించినట్లు ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు ఒడిశా సమర్పించింది. గతంలో ఒడిశా ప్రభుత్వం ఏకగ్రీవం చేసిన పంచాయతీలు, ఎన్నికలు నిర్వహించిన పంచాయతీల వివరాలు కూడా కోర్టుకు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఒడిశా పిటిషన్లో ప్రతివాదులుగా సీఎస్, నిమ్మగడ్డ
ఏపీ ప్రభుత్వం తమ భూభాగంలో తమ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని ఆక్షేపిస్తూ ఒడిశా సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ పేర్లను చేర్చింది. తమ భూభాగంలో ఎన్నికల నిర్వహణకు ఈ ముగ్గురు అధికారులను బాధ్యుల్ని చేయాలని తమ పిటిషన్లో ఒడిశా కోరింది. అయితే ఒడిశా పిటిషన్పై ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ ఇంకా స్పందించాల్సి ఉంది.