ఏపీకి గవర్నర్ ఓకే కానీ రాజ్ భవన్ ఏది ? గవర్నర్ నివాసంపై ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరి చందన్ ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగడంతో ఏపీ లో గవర్నర్ ఎక్కడ ఉంటారు అన్న సమస్య తలెత్తలేదు. కానీ ప్రస్తుతం నరసింహన్ ను తెలంగాణాకు పరిమితం చేస్తూ, ఏపీకి గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరి చందన్ ను పంపించడంతో ఇప్పుడు ఆయన నివాసం పై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్ భవన్ లేని రాష్ట్రం ఏపీలో కొత్త గవర్నర్ నివాసంపై అధికారవర్గాల తర్జన భర్జన
రాష్ట్రంలోని అమరావతిలో ఇప్పటివరకు రాజ్ భవన్ నిర్మాణం పూర్తి కాలేదు. పదేళ్లపాటు ఏపీ, తెలంగాణకు ఉమ్మడి గవర్నర్ ఉంటారని భావించిన నేపథ్యంలోనే రాజ్ భవన్ నిర్మాణంపై గత టిడిపి ప్రభుత్వం దృష్టి సారించలేదు. అయితే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్లను వేరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కి కొత్త గవర్నర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీలో రాజ్ భవన్ లేకపోవడంతో గవర్నర్ అధికారిక నివాసం ఎక్కడ? ఆయన వ్యక్తిగత నివాసం ఎక్కడ అన్న దానిపై ఏపీ అధికార వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.
సీఎం క్యాంపు ఆఫీసునే ఆధునికీకరించి గవర్నర్ నివాసంగా మార్చనున్న అధికారులు
ఏపీలో రాజ్ భవన్ లేకపోవడంతో ఇంతకాలం ఏపీలోని కార్యక్రమాలకు హాజరైన గవర్నర్ నరసింహన్ స్టార్ హోటల్స్ లో బస చేసేవారు .ఇప్పుడు ఏపీకి గవర్నర్ ను కేటాయించడంతో కొత్త గవర్నర్ కోసం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ను గవర్నర్ నివాసంగా మారుస్తున్నారని సమాచారం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పరిపాలనను ఏపీ నుండి సాగించాలనుకున్నప్పుడు అందుకు వీలుగా ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బందర్ రోడ్డులోని ఈ భవనం మొదట్లో ఇరిగేషన్ ఆఫీసుగా ఉండేది. తర్వాత ఆధునికీకరించి సీఎం క్యాంప్ ఆఫీసుగా మార్చారు. మొన్నటి వరకు తాత్కాలిక హైకోర్ట్గా కూడా ఈ భవనాన్నే వాడారు.
జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగిస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం
జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగిస్తున్న నేపధ్యంలో దీంతో పాత క్యాంప్ ఆఫీస్ను గవర్నర్కు కేటాయించనున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ భవనం గవర్నర్కి ఇస్తున్నట్లుగా చర్చ సాగుతోంది. ఆశ్చర్యకర అంశం ఏమిటంటే గవర్నర్ కు రాజ్ భవన్ లేని ఏకైక రాష్ట్రంగా ప్రస్తుతం ఏపీ ఉంది. అయితే సీఎం క్యాంపు కార్యాలయంలో కొన్ని రోజుల పాటు బస చేసిన తర్వాత ఆయన అభిరుచికి తగిన భవనం ఇస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి.