దేశంలోనే ఎక్కువ వృద్ది సాధించిన రాష్ట్రం ఏపీ:కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు
విజయవాడ:గడిచిన నాలుగేళ్లలో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వృద్ధి రేటు సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు గురువారం విజయవాడలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో 10.52 శాతం వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీనేని అన్నారు. అలాగే తిత్లీ తుపాను సమాచారం రాగానే ముందుజాగ్రత్త చర్యలపై ఆలోచించామని, అర్ధరాత్రి అధికారులతో మాట్లాడి ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. అంతేకాకుండా తుపానుపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశామన్నారు.
తుఫాన్ పై...బాగాచేశాం
తుపానుపై 15 మంది మంత్రులు, 110 మంది డిప్యూటీ కలెక్టర్లు అప్రమత్తమయ్యారని...20 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామని...ఇది గొప్ప విషయమని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు.
రైతులు...అటు మారాలి
రైతులు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కు మారాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధికారులు ఆ దిశగా రైతులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. హార్టికల్చర్లో రిస్క్ తక్కువ...ఆదాయం ఎక్కువ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఎపి...మెరుగైన పనితీరు
అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఏ రంగంలో ఎంత మేరకు రాణిస్తున్నామనేది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రధాన రంగాలకు తోడు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు బాగుందని, ఇప్పుడున్న రెండంకెల వృద్ధిని సుస్థిరం చేయాలని యనమల కోరారు.
సిఎం...దిశానిర్ధేశం
రానున్న కాలంలో ఇదే వృద్ధిని కొనసాగించడానికి ఎటువంటి కృషి చేయాలో మార్గదర్శనం చేసుకోవాలన్నారు. తయారీ, పర్యాటక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం ప్రారంభమైన ఈ కలెక్టర్ల సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై కలెక్టర్లకు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు.