హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్: ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ ఇన్..జస్టిస్ కనగరాజ్ ఔట్..!
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్గా మారిన వార్కు హైకోర్టు తెరదించింది. నిమ్మగడ్డ రమేష్ను కొనసాగించాలంటూ తీర్పు చెప్పింది. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ను తొలగిస్తూ తీసుకువచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ను సైతం ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రమేష్ కుమార్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
నిమ్మగడ్డపై హైకోర్టు తీర్పు
ఏపీ హైకోర్టు శుక్రవారం రోజున సంచలన తీర్పు ఇచ్చింది. గత కొంత కాలంగా ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్గా సాగుతున్న వార్కు తెరదించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎన్నికల అధికారిగా తొలగించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో నిమ్మగడ్డను తొలగించేందుకు తీసుకొచ్చిన జీవోలు, ఆర్డినెన్స్లను సైతం కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను మార్చడం సరికాదని కోర్టు గుర్తు చేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టం చేసింది. కొత్త ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ నియామకం చెల్లదని పేర్కొంది. తిరిగి వెంటనే ఆయన్ను విధులో చేర్చుకోవాలని స్పష్టం చేసింది.
ఈ క్షణమే విధుల్లో చేరుతాను: నిమ్మగడ్డ
ఇదిలా ఉంటే మాజీ మంత్రి కామినేని తన పిటిషన్లో పేర్కొన్న అన్ని విషయాలపై కోర్టు ఏకీభవించింది. కోర్టు తాజా ఆదేశాలతో ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో వెంటనే విధుల్లో చేరుతానని స్పష్టం చేశారు. వ్యక్తులు శాశ్వతం కాదని చెప్పిన నిమ్మగడ్డ రాజ్యాంగమే శాశ్వతం అన్నారు. తను ఎస్ఈసీగా ఉన్న సమయంలో తన విధులను నిష్పక్షపాతంతో నిర్వహించానని చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు.
Recommended Video
పిటిషనర్ కామినేని ఏమన్నారంటే..
ఇక నిమ్మగడ్డ వ్యవహారంలో మొత్తం 13 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో మాజీ మంత్రి కామినేని ఒక పిటిషనర్గా ఉన్నారు. కోర్టు తీర్పు అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించి అభాసుపాలైందన్నారు. హైకోర్టే కాదు ఎవరు చెప్పిన అలా ఒక ఎన్నికల సంఘం అధికారిని అకారణంగా తొలగించడం తప్పనే చెబుతారని కామినేని అన్నారు. ఎన్నికల సంస్కరణలు ప్రభుత్వం తీసుకురావచ్చని పేర్కొన్న కామినేని.. అయితే ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సంస్కరణలు అని వంక పెడుతోందని మండిపడ్డారు. లాక్డౌన సమయంలో ఆగమేఘాలపై ఎన్నికల అధికారి మార్పును ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అదే సమయంలో జస్టిస్ కనగరాజ్ను నియమించడం కూడా తప్పే అని కామినేని అన్నారు. హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు కామినేని చెప్పారు.
మొత్తానికి ఏపీ హైకోర్టు నుంచి ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు ఎదురవుతుండటం తాజాగా నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ఎదురుదెబ్బ తగలడంతో ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తుందో వేచిచూడాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళుతుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.