ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- మూడు బాటిళ్లకు ఓకే అన్న హైకోర్టు...
ఏపీలో మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో తమకు నచ్చిన మద్యం బ్రాండ్లు దొరక్క, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి హైకోర్టు తాజా ఆదేశాలు ఊరటనిచ్చాయి. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 411ను అమలు చేయాలని, ఈ మేరకు వీరికి ఊరట నివ్వాలని హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఏపీలో ప్రస్తుతం మూడు బాటిళ్ల వరకూ తమతో పాటు తీసుకుని ప్రయాణించేందుకు, రవాణా చేసేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. గతంలో ప్రభుత్వం ఈ మేరకు జీవో నంబర్ 411 జారీ చేసింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆ మూడు బాటిళ్లను కూడా అనుమతించడం లేదు. దీంతో ఒకటీ అరా బాటిళ్లతో ఏపీలోకి వస్తున్న వారిని కూడా పోలీసులు చెక్ పోస్టుల వద్ద అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో నంబర్ 411 ప్రకారం మూడు బాటిళ్లను తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నప్పుడు చెక్ పోస్టుల వద్ద ఇలా తీసుకొస్తున్న వారిపై ఎలా కేసులు నమోదు చేస్తారని ఇవాళ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వమే అమలు చేయకుండా ఇలా ఆంక్షలు విధించడమేంటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై మూడు బాటిళ్లను రాష్ట్రంలోకానీ, రాష్ట్రంలోకి కానీ తీసుకుని ప్రయాణాలు చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు జీవో నంబర్ 411ను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.