అచ్చెన్నాయుడికి ఊరట- ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశం...
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ తర్వాత అచ్చెన్నాయడును గుంటూరు జీజీహెచ్ కు తరలించిన పోలీసులు... కాస్త కోలుకున్న అనంతరం తిరిగి విజయవాడ జిల్లా జైలుకు పంపారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు తన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన న్యాయస్ధానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ఈఎస్ఐ స్కాంలో పట్టుబిగిస్తున్నఏసీబీ- అచ్చెన్నాయుడి విచారణలో కీలక ఆధారాలు...?
హైకోర్టులో వాదనల సందర్బంగా అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అయితే చివరికి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండ్ సూచించిన ఆస్పత్రికి పంపేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. దీని ప్రకారం గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి ఆయన్ను తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈఎస్ఐ స్కాం కేసులో అచ్చెన్నాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్రపై తగిన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ నిరూపించడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఓసారి కస్టడీలోకి తీసుకుని విచారించారు.