డాక్టర్ సుధాకర్ కు భారీ ఊరట- మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కు హైకోర్టు ఓకే...
విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా మద్యంమత్తులో ఏపీ సీఎం జగన్ ను, ప్రధాని మోడీని దుర్భాషలాడి ఆ తర్వాత విశాఖ మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ ను వేరే ఆస్పత్రికి మార్చాలని ఆయన తల్లి కావేరీ బాయి పిటిషన్ వేశారు. తన కుమారుడికి మెంటల్ లేదని, మానసిక ఆస్పత్రిలో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొంది.
డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు- ఏపీలో విపక్షాలన్నీ గప్ చుప్- ఎదురుదాడి వికటించిందా ?
సుధాకర్ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని సుధాకర్ కు హైకోర్టు షరతు విధించింది. దర్యాప్తుకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మరో ఆస్పత్రిలో సుధాకర్ చికిత్స తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది.
అంతకు మందు విశాఖ మెంటల్ ఆస్పత్రిలో చేరిన వారం రోజుల తర్వాత అక్కడి తనకు ఇస్తున్న మందుల వల్ల పిచ్చెక్కుతోందని, నోరు, పెదవులు పొడిబారుతున్నాయని సుధాకర్ ఆరోపించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఓ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన తల్లి కావేరీ బాయి ఇదే అంశాలతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రితో పాటు స్ధానిన మున్సిపల్ కార్యాలయంలోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలో ఈ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది.