రాజధానులపై హాట్హాట్గా హైకోర్టు విచారణ- మండలి చర్చ, విశాఖ గెస్ట్హౌస్ వివరాలు కోరిన కోర్టు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు రోజువారీ విచారణ ప్రారంభమైంది. తొలిరోజే పలు కీలక అంశాలపై హాట్హాట్గా వాదనలు సాగాయి. వీటిలో రాజధాని బిల్లుల ఆమోదంతో పాటు విశాఖలో సీఎం జగన్ కోసం నిర్మించ తలపెట్టిన గెస్ట్హౌస్ అంశాలపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా గతంలో పలు అంశాలపై తాము ఇచ్చిన స్టేటస్ కో కొనసాగుతుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అలాగే విశాఖలో సీఎం గెస్ట్హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
రోజువారీ విచారణ ప్రారంభం...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ ఇవాళ ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 15 పిటిషన్లపై విచారణ జరిగింది. వాస్తవానికి నిన్న విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. పిటిషన్లలో ముందుగా వేటిని విచారించాలన్న దానిపై క్లారిటీ రాలేదు. ఆ తర్వాత హైకోర్టు మూడు రాజధానులపై దాఖలైన 223 మధ్యంతర పిటిషన్లలో 189 స్టే కోసం వేసినవిగా తేల్చింది. వీటిని మినహా మిగిలిన 34 పిటిషన్లపై ముందుగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఈ 34 పిటిషన్లపై విచారణ ఇవాళ ప్రారంభమైంది. వీటి సంగతి తేలాక స్టే పిటిషన్లపై హైకోర్టు దృష్టిసారించబోతోంది.
సీఎం గెస్ట్ హౌస్లపై అభ్యంతరాలు..
పాలనా వికేంద్రీకరణ పేరుతో తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని, ముందుగా వీటి విషయం తేల్చాలని న్యాయవాది గుప్త నిన్న హైకోర్టును కోరారు. ఇవన్నీ గెస్ట్హౌస్లుగా కూడా భావించలేమన్నారు. వీటిపై సమాధానం చెప్పేందుకు సిద్ధమైన అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం.. సీరియల్ లేకుండా వాదిస్తే ఎలా సమాధానం చెప్పాలని కోర్టును ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ మరోసారి సీఎం గెస్ట్హౌస్ల వ్యవహారంపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖలో సీఎం గెస్ట్ హౌస్ నిర్మాణంపైనా వాదనలు సాగాయి. దీనిపై న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
గతంలోనూ ఉన్నాయా అని కోర్టు ప్రశ్న..
విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయంలో జరిగిన వాదనల్లో అవసరాన్ని బట్టి సీఎం క్యాంపు ఆఫీసు విశాఖలోనూ ఉండొచ్చని అడ్వకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు తెలిపారు. దీంతో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం రాకముందు కూడా ఇలాంటి క్యాంపు కార్యాలయాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీంతో గతంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్, నారావారిపల్లెలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఏఎంఆర్డీయే న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం క్యాంపు ఆఫీసుపై మరిన్ని వివరాలు సమర్పించేందుకు శుక్రవారం వరకూ గడువు ఇవ్వాలని ఏజీ హైకోర్టును కోరారు. దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు నిర్మాణానికి అనుమతిస్తున్న నిబంధనలు చెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.
మండలిలో బిల్లుల ఆమోదం వివరాలు కోరిన హైకోర్టు..
ఇవాళ మూడు రాజధానుల బిల్లులపై శాసనమండలిలో జరిగిన చర్చపైనా హైకోర్టులో వాదనలు జరిగాయి. రాజధాని బిల్లులను మండలి ఆమోదించలేదని, కానీ గవర్నర్ మాత్రం వీటికి ఆమోదముద్ర వేశారని దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. వీటిపై స్పందించిన ధర్మాసనం మండలిలో జరిగిన చర్చ వివరాలను సీల్డు కవర్లో హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీ నాటికి సీడీలు, సీల్డుకవర్లో వివరాలు ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో రాజధాని బిల్లులతో పాటు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులన్నీ యథావిథిగా కొనసాగుతాయని హైకోర్టు స్ఫష్టం చేసింది.