ఏపి హైకోర్టుకు చీఫ్ జస్టిస్ నియామకం : తాత్కాలిక హైకోర్టు విజయవాడలో..
ఏపి హైకోర్టు విభజన తో ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తుల నియామకం పై కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగం గా ఏపికి చీఫ్ జస్టిస్ ను నియమించింది. ఇక, జనవరి ఒకటి నుండి ఏపిలో హైకోర్టు ప్రారంభం పై స్థానిక ప్రభుత్వం ఏ ర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా విజయవాడలో కోర్టు నిర్వహించేలా ఏర్పాట్లు మొదలు పెట్టింది..
ఉమ్మడి హైకోర్టును రెండుగా విభజిస్తూ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. ఏపికి - తెలంగాణ కు విడి విడిగా హై కోర్టు భవనాలు..జడ్జిల విభజన పూర్తయింది. ఇదే సమయంలో అప్పాయింటెడ్ డే పై ఏపి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా..పూర్తి స్థాయిలో సిబ్బంది విభజన జరగలేదని..కేసుల విభజన పూర్తి కాలేదని...విభజన తేదీ గడువు పెంచాలని ఏపి న్యాయవాదులు హైకోర్టులో ఆందోళనకు దిగారు. అయితే, తెలంగాణ న్యాయవాదులు మాత్రం విభజన పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపి హైకోర్టు నిర్మాణం అమరావతిలో తుది దశకు చేరుకుంది. దీంతో..హైకోర్టు తాత్కాలికంగా నిర్వహించుకొనేందుకు విజయవాడలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏపి చీఫ్ జస్టిస్గా ప్రవీణ్ కుమార్..
హై కోర్టు రెండుగా విభజించటంతో..ప్రస్తుతం ఏపికి కేటాయించిన న్యాయమూర్తుల్లో సీనియర్ అయిన చాగర్రి ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక, జవనరి 1 నుండి హైకోర్టు నిర్వహణ కోసం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు.
జనవరి 1 నుండి నాల్గవ తేదీ వరకు హైకోర్టు పని చేయనుంది. ఇందు కోసం క్యాంపు కార్యాలయంలో కోర్టు హాల్స్ సిద్దం చేస్తున్నారు. దీని తో పాటుగా జడ్జీలు..సిబ్బందికి వసతి ని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 5 నుండి 20 రోజుల పాటు హైకోర్టుకు సెలవులు ప్రకటిస్తున్నారు. తిరిగి కోర్టు ప్రారంభం సమయానికి అమరావతిలో కోర్టు భవనం సిద్దం కానుంది. ఇక, ఆ భవనం లో కోర్టు కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.