ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ .. కరోనా కంట్రోల్ కోసమే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పక్క హై కోర్ట్ లో పనిచేస్తున్న సిబ్బంది కూడా కరోనా పాజిటివ్ నమోదు కావడంతో, కరోనా కట్టడిలో భాగంగా నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల విచారణ పై వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు.
తాజాగా ఏపీలో హై కోర్ట్ లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కూడా కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో అత్యవసర కేసుల్లో మాత్రమే విచారించాలని నిర్ణయం తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇక వాటిని కూడా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసంలో నుంచి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కేసుల విచారణ చెయ్యనున్నారని పేర్కొన్నారు.
అంతేకాదు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించిన కేసులు మాత్రమే విచారణకు తీసుకుంటారని పేర్కొన్నారు. న్యాయస్థానం ముందు దాఖలయ్యే పిటిషన్ను కూడా ఆన్లైన్ ద్వారానే ఈ ఫైలింగ్ విధానంలో నమోదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ ఫైలింగ్ లో డాక్యుమెంట్స్ అటాచ్ చెయ్యరాదని పేర్కొన్నారు . కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ఇప్పటికీ ఏపీ హైకోర్టు పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకున్న నిర్ణయంతో కోర్టులో పనిచేసే సిబ్బంది గానీ, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, కక్షి దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.
Recommended Video
ఏపీలో ఏడో విడత ఉచిత రేషన్... రేపటి నుండే .. గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇప్పటికే కోర్టు సిబ్బంది కరోనా రావడంతో అప్రమత్తమైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కట్టడి కష్టంగా మారిన నేపథ్యంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసుల్లో మాత్రమే విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.