ఏపీలో స్ధానిక ఎన్నికలు ఫిబ్రవరిలోనే ?- స్టే నిరాకరణతో ఎస్ఈసీకి క్లారిటీ- వైసీపీకి ఝలక్
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దీంతో కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన పస లేకుండా పోయింది. ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదంటూ ప్రభుత్వం వాదించినా హైకోర్టు మాత్రం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆదేశాలు వైసీపీకి శరాఘాతంగా మారాయి. హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరిలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.
స్ధానిక పోరుపై చెల్లని వైసీపీ వాదన..
ఏపీలో కరోనా పేరుతో స్ధానిక ఎన్నికల నిర్వహణను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో మరోసారి ఎన్నికలు ఎదుర్కోకూడదని భావిస్తున్న వైసీపీ సర్కారు.. మళ్లీ అదే కరోనా పేరుతో ఎన్నికల వాయిదా కోరుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీకి హాజరు కాని వైసీపీ, ఆ తర్వాత అధికారులతోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించకుండా అడ్డుపడింది. కరోనా సమయంలో ఎన్నికలేంటని మంత్రులు, సీఎస్ సహా వైసీపీ నేతలంతా ప్రకటనలు చేశారు. కానీ ఈ మేరకు ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టులోనూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కానీ చివరికి వైసీపీ వాదన చెల్లకుండా పోయింది.
స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు...
ఏపీలో కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. స్ధానిక ఎన్నికలపై దాఖలైన రెండు ప్రజాప్రయోజన వాజ్యాల్లో హైకోర్టు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ తెలిపారు. దీంతో పాటు స్వతంత్ర రాజ్యాంగ సంస్ధ అయిన ఎస్ఈసీ నిర్ణయాలకు ప్రభుత్వం సహకరించాల్సిందేనని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణపై స్టే విధింఛాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనకు హైకోర్టు అంగీకరించలేదు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, దీనిపై స్టే ఇవ్వడం కుదరదని, అలాగే స్టేటస్కో కూడా ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎస్ఈసీ నిర్ణయాలు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.
Recommended Video
హైకోర్టు కాదంటే సుప్రీంకు వైసీపీ..
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తుది తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఇవాళ కూడా హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపబోతోంది. హైకోర్టులో ఎన్నికల నిర్వహణ వాయిదాకు సంబంధించి సానుకూల ఆదేశాలు రాకపోతే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. స్ధానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఇప్పటికే హైకోర్టు ఎస్ఈసీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తుదితీర్పు ఎలాగో తమకు అనుకూలంగా రాదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు స్ధానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్న వైసీపీకి తాజా పరిణామాలు ఎదురుదెబ్బగా మారుతున్నాయి.