అచ్చెన్నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ: ఏపీ హైకోర్టులో: ఇప్పట్లో సాధ్యం కానట్టే
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ పిటీషన్ విషయంలో ఆయనకు చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటీషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. విచారణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వటం సరికాదంటూ అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది చేసిన వాదనలను పరిణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు బెయిల్ పిటీషన్ను కొట్టేసింది.
వైఎస్ జగన్ సొంత జిల్లాలో మరో నీటి ప్రాజెక్టు: 20 టీఎంసీల కెపాసిటీతో: గాలేరు-నగరిపై
కొద్దిసేపటి కిందటే విచారణకు..
కోట్లాది రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు చెబుతోన్న ఈఎస్ఐ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలను అచ్చెన్నాయుడు ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల కస్టడీలో కొనసాగుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విచారణను ఎదుర్కొంటున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కొద్దిరోజుల కిందటే పిటీషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకించింది హైకోర్టు. బుధవారం ఈ పిటీషన్ న్యాయమూర్తుల ముందుకు విచారణకు వచ్చింది.
దర్యాప్తు ప్రభావితం.. బెయిల్ పిటీషన్ కొట్టివేత..
అచ్చెన్నాయుడు సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే.. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి అవకాశం ఉంటుందని ఏసీబీ తరఫు న్యాయవాది వాదించారు. కోట్లాది రూపాయల మేర అవకతవకలతో ప్రమేయం ఉన్న కేసు కావడం వల్ల బెయిల్ ఇవ్వకూడదని చెప్పారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్నారని, విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ దశలో బెయిల్ ఇవ్వడం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.
జీజీహెచ్ నుంచి డిశ్చార్జి అయినా..
ఏసీబీ తరఫు న్యాయవాది అభిప్రాయాలతో హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించారు. బెయిల్ పిటీషన్ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టు అయ్యే సమయానికి ముందే అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోన్న అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకుని రావడంతో ఆయన అనారోగ్యం మరింత క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. ప్రారంభంలో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ అక్కడే విచారణను ఎదుర్కొన్నారు.
ఇతర నిందితుల పిటీషన్లపైనా..
అనంతరం డిశ్చార్జి అయిన ఆయన.. తన అనారోగ్యం మళ్లీ తిరగబెట్టినట్టు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి బదులుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేయగా.. దానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫలితంగా అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులు అరెస్టయిన నిందితులు రమేష్ కుమార్, మురళీ, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు న్యాయమూర్తులు తిరస్కరించారు.