జగన్ సర్కారుకు హైకోర్టులో మరో షాక్- పంచాయతీ ఎన్నికలపై స్టేకు నిరాకరణ
ఏపీలో కరోనా పేరుతో వాయిదా పడిన స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టులో మరోసారి మద్దతు లభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి నిరాశ తప్పలేదు.
ఏపీలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు 300 నుంచి 600 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ప్రజాజీవనం సాధారణ స్ధితికి చేరుకుంది. దీంతో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని వైసీపీ సర్కారు ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని, ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తమదే అంటూ ఎన్నికల సంఘం చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్ధనను హైకోర్టు కొట్టేసింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి లైన్ క్లియర్ అయింది. అయితే ఈ పిటిషన్లో మిగతా అంశాలను విచారించేందుకు వీలుగా ఈ నెల 14లోగా ఎన్నికల సంఘం కౌంటర్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది.