ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు..!!
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టి వేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టడానికి అవసరమైన సమగ్ర సమాచారం గానీ, ఇతర వివరాలు గానీ ఇందులో లేవని భావించినట్లు సమాచారం. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సంతృప్తికరమైన వివరణ ఇచ్చిందనే చెబుతున్నారు.
వీడియో: స్టేజీ మీద, అందరూ చూస్తోండగా ఎడం కాలి చెప్పుతో చితగ్గొట్టింది..!!
కోర్టు ధిక్కారణ కేసు కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఇదివరకు ఏబీ వెంకటేశ్వర రావు ఈ పిటీషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన అపాయింట్మెంట్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదనేది ఆయన ఆరోపణ. ఇదే విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇవ్వాళ మళ్లీ ఈ పిటీషన్ న్యాయస్థానం సమక్షానికి విచారణకు వచ్చింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇచ్చిన వివరణతో ఏకీభవించారు న్యాయమూర్తులు. సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంతో ఏబీ వెంకటేశ్వర రావు దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్కు సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఏబీ వెంకటేశ్వర రావు ఎదుర్కొంటోన్నారు.
గతంలో తనను సస్పెండ్ చేసిన సమయానికి సంబంధించి పూర్తి జీతం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాను లేఖలు రాసినా ఆశించిన స్థాయిలో స్పందించలేదని ఏబీ వెంకటేశ్వర రావు చెబుతున్నారు. ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని పిటిషన్లో స్పష్టం చేశారు. ఇప్పుడీ పిటీషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని సమాచారం.