టీడీపీ నేత వర్ల రామయ్య పిటీషన్పై జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్: అయినా
అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్లో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విషయంలో జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ ఎన్నికలను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే జారీ చేసింది. అయినప్పటికీ- ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి వీలు ఇవ్వలేదు. దీనిపై ఈ నెల 27వ తేదీన సమగ్ర విచారణ నిర్వహిస్తామని తెలిపింది. ఈ కేసుపై సమగ్ర విచారణ ముగిసేంత వరకూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు అమలు కాబోవని జగన్ సర్కార్కు హామీ ఇచ్చింది. తన తదుపరి విచారణను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్.. 27వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video
MAA elections 2021: మెగా కాంపౌండ్ కీ రోల్: చిరంజీవి సపోర్ట్ ఎవరికో తేల్చేసిన నాగబాబు
రాష్ట్రంలో ఏప్రిల్ మొదటివారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను వెల్లడించకూడదంటూ అప్పట్లో ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తరువాత- మొత్తంగా ఈ ఎన్నికలనే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తదితరులు దాఖలు చేసిన పిటీషన్పై సింగిల్ బెంచ్ సానుకూలంగా స్పందించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసింది. సింగిల్ బెంచ్ జారీ చేసిన ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది.
ఈ అప్పీల్ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ పలు దఫాలుగా విచారణను కొనసాగించింది. ఎన్నికల కమిషన్ కార్యాలయం వాదనలతో ఏకీభవించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయడంపై స్టే మంజూరు చేసింది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ అంశంపై ఈ నెల 27వ తేదీన సమగ్రంగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఆ ఎన్నికలను నిర్వహించారనేది వర్ల రామయ్య వాదన.