జగన్ సర్కార్కు హైకోర్టు షాక్.. రాజధాని రైతులపై దాడి ఘటనపై జడ్జీల సీరియస్..
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోలనలను చేస్తోన్న రైతుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రాజధాని ప్రాంతంలో గత వారం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, పలు మీడియా సంస్థలు ప్రసారం చేసిన వీడియోలు, పబ్లిష్ చేసిన ఫొటోను పరిశీలించిన జడ్జిలు.. పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఆగ్రహించారు. సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు బాధ్యులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
నిరసనలు చేస్తే తప్పేంటి?
రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో నిరసన చేస్తోన్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరింపజేయడంతోపాటు ఎంపికచేసుున్న గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్ కవాతు నిర్వహించడం, చాలా చోట్ల 144 సెక్షన్ విధింపు, చాలా చోట్ల లాఠీచార్జ్ ఘటనలు జరిగాయి. తోపులాటల్లో మహిళలు, చిన్నపిల్లలు గాయపడ్డట్లు మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కనీసం శాంతియుత నిరసనలకు కూడా ఎందుకు అనుమతించలేదని హైకోర్టు.. పోలీసుల్ని ప్రశ్నించింది.
ఏకమైన లాయర్లు..
రాజధానిని అమరావతిలోనే కొనసాగించలని ఇప్పటికే తీర్మానం చేసిన విజయవాడ బార్ అసోసియేషన్.. సోమవారం ఏడు పిటిషన్లు దాఖలు చేసింది. రైతులపై పోలీసుల బలప్రయోగం వ్యవహారాన్ని కోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించిన తర్వాత లాయర్లు విడివిడిగా వీటిని దాఖలు చేశారు. ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోనీయకుండా పోలీసులు అడ్డుపడుతున్న తీరును లాయర్లు కోర్టుకు వివరించారు.
కౌంటర్ దాఖలుకు ఆదేశం
రాజధాని ప్రాంతంలో వాతావరణం అప్రకటిత కర్ఫ్యూలా ఉందని, అసలు గ్రామీణ ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించడమేంటని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. పోలీసుల దమనకాండ, దురుసుప్రవర్తనకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లకు కౌంటర్ వేయాలంటూ జగన్ సర్కారును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిఉంది.