మూడు రాజధానులపై హైకోర్టు మరో షాక్- అక్టోబర్ 5 వరకూ స్టేటస్కో- ఇక రోజువారీ విచారణ
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియపై సుదీర్ఘ విచారణ తప్పేలా లేదు. ఇప్పటికే రాజధానుల విషయంలో దాఖలైన పిటిషన్ల సంఖ్య 93కు చేరింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు, రైతులు, స్ధానికులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అక్టోబర్ 5 వరకూ వీటిని వాయిదా వేసింది. పిటిషన్ల సంఖ్య, వీటి తీవ్రత ఆధారంగా రోజువారీ విచారణ జరిపేందుకూ హైకోర్టు అంగీకరించింది. దీంతో అక్టోబర్ 5 నుంచి వీటిపై రోజువారీ విచారణ ప్రారంభం కానుంది. అప్పటివరకూ రాజధాని బిల్లులపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగిస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.
మూడు రాజధానుల పిటిషన్లు..
ఏపీలో ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా హైకోర్టులో కుప్పలుతెప్పలుగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే దాఖలైన 93 పిటిషన్లపై విచారణ జరపడం కూడా హైకోర్టుకు ఇబ్బందిగా మారింది. ఆయా పిటిషన్లలో అమరావతి నిర్మాణం నేపథ్యం, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వీటిలో సాంకేతిక అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, రైతులతో ఒప్పందాలు వంటి అంశాలు కీలకంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానులపై తమ అభిప్రాయాలు వెల్లడించినా పలు సాంకేతిక, ఆర్ధిక సమస్యలతో ముడిపడి ఉన్న ఈ పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘ విచారణ నిర్వహించాల్సి ఉంది.
రోజువారీ విచారణకు హైకోర్టు నిర్ణయం..
ఏపీలో మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటిలో ఉన్న తీవ్రత ఆధారంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయా పిటిషన్లపై రోజువారీ విచారణకు హైకోర్టు అంగీకరించింది. పిటిషన్లలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాల సేకరణ, తిరిగి వాటిపై విచారణ నిర్వహించడం, కాలయాపన లేకుండా చూడటం ముఖ్యం కాబట్టి హైకోర్టు అక్టోబర్ 5 నుంచి వీటిపై రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం కూడా తమవైపు నుంచి అన్ని వాదనలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు కూడా రాజధానికి అనుకూలంగా దాఖలైన పిటిషన్లను వాదిస్తున్నందున వీటి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు.
రాజధాని బిల్లులపై స్టేటస్ కో పొడిగింపు..
గవర్నర్ ఆమోదం పొందిన రాజధాని బిల్లులపై హైకోర్టు రెండు నెలల క్రితమే స్టే ఇచ్చింది. అప్పటి నుంచి దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నందున స్టేటస్ కో ఉత్తర్వులను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి అక్టోబర్ 5 వరకూ రాజధాని బిల్లులపై స్టేటస్ కో పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 5 నుంచి రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అప్పటివరకూ స్టేటస్ కోను పొడిగించారు. కేసు విచారణను కూడా అక్టోబర్ 5కు వాయిదా వేశారు. స్టేటస్ కో నేపథ్యంలో రాజధాని బిల్లుల్లో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది.
రాజధాని తరలించకపోయినా విశాఖలో గెస్ట్ హౌస్..
మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇవాళ హైకోర్టులో మరో కీలక అంశం చర్చకు వచ్చింది. విశాఖకు పాలనా రాజధానిని తరలించడంపై హైకోర్టు స్టేటస్ కో అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు గతంలో చెప్పింది. కానీ ప్రభుత్వం రాజధానితో సంబంధం లేకుండానే విశాఖలోని తొట్లకొండపై గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపైనా అక్టోబర్ 5న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. రాజధాని తరలింపు ఆలస్యం నేపథ్యంలో ప్రభుత్వం విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చింది.