AP Fibernet scam: కోగంటి సాంబశివరావుకు బిగ్ రిలీఫ్
అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ దుమారానికి కారణమౌతోన్న ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇదివరకే అరెస్టయిన ఐఆర్టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కేసుపై సమగ్ర దర్యాప్తునకు దిగిన సీఐడీ అధికారులు ఆయనను రెండు రోజుల కిందటే అరెస్ట్ చేశారు.
ఏపీ హైకోర్టు తాజాగా కోగంటి సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని, తనకు మద్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సాంబశివరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నలభై ఎనిమిది గంటల సేపు జైలులో ఉంటే తన ఉద్యోగం పోతుందని ఆయన పేర్కొన్నారు. సాంబశివరావు తరపున ప్రముఖ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలను వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం- సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను కోగంటి సాంబశివరావు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ టెండర్లను అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ పనులు, టెండర్ల వ్యవహారంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అధికార వైఎస్సార్సీపీ ఆరోపిస్తూ వస్తోంది.
సుమారు రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇదివరకు పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇందులో 121 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందనే కారణంతో సీఐడీ కోగంటి సాంబశివరావుపై కేసు నమోదు చేసింది. సాంబశివరావు అరెస్టయిన అనంతరం ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు ఉన్న హరిప్రసాద్, గోపీనాథ్ను విచారణకు పిలిచింది. ఇక తాజాగా ఈ కేసులో కోగంటి సాంబశివరావుకు బెయిల్ మంజూరు అయింది.
ఆయనకు బెయిల్ మంజూరు చేయడం పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియరావాల్సి ఉంది. అప్పీల్కు వెళ్లొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కోగంటి సాంబశివరావు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఈ మేరకు సీఐడీ అధికారులు అప్పీల్కు చేసుకుంటారని సమాచారం. ఆయన బయటే ఉంటే- ఈ కేసులో సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారనే అనుమానాలు అధికారుల్లో నెలకొని ఉన్నట్లు చెబుతున్నారు.