రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీసిన జీఓ నంబర్ 1పై ఏపీ హైకోర్టు ఇవ్వాళ తన వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు సభల్లో 11 మంది మరణించడంతో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేస
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 1 అమలుపై తాజా అప్ డేట్ వెలువడింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరుల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో తొక్కిసలాట అనంతరం- అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీఓ ఇది.
కందుకూరు, గుంటూరు ఘటనలతో..
డిసెంబర్ 28వ తేదీన కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన సంభవించిన సరిగ్గా మూడు రోజుల్లోనే గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ అదే పరిస్థితి తలెత్తింది. చంద్రన్న కానుకల పంపిణీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరో ముగ్గురు మహిళలు ప్రాణాలను కోల్పోయారు.
కీలక ఉత్తర్వులు..
ఈ రెండు సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైనా ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
హైకోర్టులో..
ఈ జీఓ అమలుపై స్టే విధించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ జీఓను సస్పెండ్ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం వాదనలను చేపట్టింది. జీఓ నంబర్ 1ను సస్పెండ్ చేస్తూ వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది.
తీర్పు రిజర్వ్..
23వ తేదీన వాదనలను విన్న చీఫ్ జస్టిస్ సారథ్యంలోని బెంచ్.. ఇవ్వాళ మరోసారి విచారణను చేపట్టింది. పిటీషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదోపవాదాలను ఆలకించింది. పిటీషనర్ల తరపు న్యాయవాదుల వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించలేదంటూ అడ్వొకేట్ జనరల్ వాదించారు. సెక్షన్ 30లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా బహిరంగ సభలను నియంత్రించడానికే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది.
వాటిల్లో నిషేధం..
జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న రోడ్లపై బహిరంగ సభలు గానీ, ర్యాలీలను గానీ నిర్వహించడాన్ని నిషేధించింది హోం మంత్రిత్వ శాఖ. మున్సిపాలిటీల ఆధీనంలో ఉన్న రోడ్లను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్ రహదారులపైన ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇరుకు రోడ్లు, సందుల్లో సభలను నిర్వహించడానికి, ర్యాలీలను చేపట్టడానికి అనుమతి లేదని వివరించింది.
వెసలుబాటు కూడా..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. సభలు, ర్యాలీలను నిర్వహించే విషయంలో కొత్త మార్గదర్శకాలకు లోబడాల్సి ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించింది.