జగన్ సర్కార్ మెడకు మరో కోర్టు కేసు: ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై: రేపు విచారణ
అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కులను ఎదుర్కొంటోంది. పరిపాలనలో చట్టపరమైన సవాళ్లలను ఎదురొడ్డుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు రద్దు మొదలుకుని పలు అంశాలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కటొక్కటిగా విచారణకు రానున్నాయి.
ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై..
తాజాగా- ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు ప్రభుత్వం అందజేస్తోన్నగౌరవ వేతనాన్ని పెంచడాన్ని కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధీష్ రాంభొట్ల ఈ పిల్ను దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్లో ఈ పిటీషన్ దాఖలైంది. ఈ రిట్ పిటీషన్ (పిల్) నంబర్ 152/2019 సోమవారం మరోసారి విచారణకు రానుంది. ఈ పిటీషన్ను ఇదివరకే విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది.
ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్..
ఈ పిటీషన్పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది. సుధీష్ రాంభొట్ల దాఖలు చేసిన పిల్, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను కలిపి హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం వినిపించే వాదనను ఆలకించనుంది. ప్రభుత్వ ఖజానా నుంచి ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు ఇదివరకే గౌరవవేతనం అందుతోందని, దీన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకుందని సుధీష్ రాంభొట్ల ఈ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14,15,25,26,27 ప్రకారం విరుద్ధమని చెప్పారు.
హైకోర్టులో ఉండగానే.. ఏప్రిల్ నుంచి పెంపుపై ఉత్తర్వులు..
ఈ కేసు హైకోర్టులో విచారణ దశలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు పెంచిన గౌరవ వేతనాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు వర్తించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో ఇమామ్, మౌజమ్లు అయిదువేల మంది చొప్పున పని చేస్తున్నట్లు గుర్తించింది. వారి గౌరవవేతనాన్ని ఇమామ్కు అయిదు వేల నుంచి 10 వేల రూపాయలు, మౌజమ్కు అయిదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచింది. దీనికి సంబంధించిన దరఖాస్తులను వలంటీర్లకు అందజేయాల్సి ఉంటుందంటూ ఇటీవలే ఉత్తర్వులను వెల్లడించింది.
కొత్తగా పాస్టర్లకు
చర్చిల్లో పనిచేసే పాస్టర్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాన్ని చెల్లించే విధానం రాష్ట్రంలో ఇప్పటిదాకా లేదు. కొత్తగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది జగన్ సర్కార్. పాస్టర్లకు అయిదు వేల రూపాయల మొత్తాన్ని చెల్లించబోతోంది. ఈ అంశాన్ని ఇదివరకే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఇమామ్, మౌజమ్, పాస్టర్లకు గౌరవ వేతనాన్ని అందజేయడానికి అవసరమైన దరఖాస్తులను వలంటీర్ల ద్వారా స్వీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది.