ఏపీ హై కోర్టు కాదది .. స్విమ్మింగ్ పూల్ .. వర్షాలతో బయటపడిన నిర్మాణంలో డొల్లతనం
ఏపీ హైకోర్టు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తోంది. అమరావతిలో వర్షాల కారణంగా ఏపీ హైకోర్టు స్విమ్మింగ్ పూల్ లా మారిపోయింది. గతంలో ప్రభుత్వ కార్యకలాపాలకు తాత్కాలిక భవనంగా నిర్మించబడిన భవన నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. విపరీతంగా కురుస్తున్న వర్షాలకు సీలింగ్ నుంచి ధారాపాతంగా నీరు కారుతుంటే, హైకోర్టు భవనం లో ఉన్న వస్తువులు తడవకుండా ఉండడం కోసం నానా పాట్లు పడుతున్నారు అక్కడి సిబ్బంది.
గతంలో అధికారంలోఉన్నతెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన సచివాలయంలో గతంలో వర్షం కురవగానే భారీగా వరదనీరు చేరిన సంగతి తెలిసిందే. అప్పుడది ఏపీలో పెద్ద దుమారమే రేపింది. దీనిపై అప్పటి ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఇప్పుడు తాజాగా ఏపీ తాత్కలిక హైకోర్టులోనూ వర్షాల కారణంగా లోపల నీటిని తోడి బయట పొయ్యాల్సిన దుస్థితి నెలకొంది. హైకోర్టులో సీలింగ్ కారుతున్న పరిస్థితి తలెత్తింది. ఇటీవల గుంటూరు జిల్లాలో కురిసిన వర్షాలకు హైకోర్టు భవనంలోపల ఎక్కడికక్కడ లీకేజీలు చోటుచేసుకోవడంతో కురుస్తోంది.
హైకోర్టులోని ఛాంబర్లలలో ఉన్న పైకప్పు నుంచి ధారాళంగా నీరు కారడం ప్రారంభమైంది. ఇక బకెట్ల కొద్దీ నీరు హైకోర్టు భవనం లోపల చాంబర్లలో నిండుతూ ఉండడంతో అక్కడ ఉన్న సిబ్బంది హైకోర్టు భవనంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినకుండా వాటిని లీకేజీ లేని ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో గత ప్రభుత్వం నాణ్యతలేని నిర్మాణం చేయటం వల్లే హై కోర్ట్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ తలపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.