జగన్ సర్కార్కు మరో షాక్: టీడీపీ మాజీమంత్రిని అరెస్టు చెయ్యొద్దు: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి: జగన్ ప్రభుత్వానికి మరోసారి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. విశాఖపట్నం రూరల్ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని దూషించిన వ్యవహారంలో అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. స్వయానా కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు.
తాను ఎలాంటి దూషణలు చేయలేదని, ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కేసును తనపై బనాయించిందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ కేసును కొట్టేయాలని విజ్ఙప్తి చేస్తూ ఆయన శనివారం ఏపీ హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కొద్దిసేపటి కిందటే దీనిపై విచారణ ముగిసింది. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అంతకుముందు- హైడ్రామా మధ్య అయ్యన్న పాత్రుడు అదృశ్యం అయ్యారు. అజ్ఙాతంలోకి వెళ్లారు. పోలీసులు తనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందిన వెంటనే ఆయన మాయం అయ్యారు. ఆయన సెల్ఫోన్ నంబర్ కాల్డేటా, సిగ్నళ్ల ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. తాను దాఖలు చేసిన పిటీషన్ సోమవారం నాడు విచారణకు రానున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికే అజ్ఙాతంలోకి వెళ్లారని అంటున్నారు.
తీరా- హైకోర్టు ఆదేశాలు అయ్యన్న పాత్రుడికి అనుకూలంగా వెలువడ్డాయి. ఆయనను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు.. పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా- ఆయన అరెస్టుకు బ్రేక్ పడినట్టే. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అయ్యన్న పాత్రుడు బహిరంగంగా బూతులు తిట్టిన విషయం తెలిసిందే. బట్టలు ఊడదీయాల్సిన పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ ఆయన కృష్ణవేణిని బహిరంగంగా.. మైకులో హెచ్చరించారు. దీనిపై మనస్తాపానికి గురైన కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.