జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు నుంచి మరో స్టే: ఇక వారిపై సీఐడీ దర్యాప్తునకు బ్రేక్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథక్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉద్యోగులపై కొనసాగుతోన్న సీఐడీ అధికారుల దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే మంజూరు చేసింది. వారిపై తదుపరి విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, పునర్నియామకం వ్యవహారానికి తెర పడినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మరో స్టే జారీ అయింది.
నిమ్మగడ్డ పిటీషన్పై విచారణ.. స్టే..
ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉద్యోగులపై సీఐడీ విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీన్ని నిలిపివేయాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవలే హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని పేర్కొన్నారు. తన కార్యాలయం ఉద్యోగులపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్, ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగా వారిపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు.
హార్డ్ డిస్క్.. పెన్డ్రైవ్
సాంబమూర్తి వినియోగించిన కంప్యూటర్ హార్డ్డిస్క్లోని కొంత కీలక సమాచారాన్ని సీఐడీ అధికారులు తమ వెంట తీసుకెళ్లారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ తన పిటీషన్లో పేర్కొన్నారు. సాంబమూర్తిని సీఐడీ అధికారులు ఉద్దేశపూరకంగా వేధిస్తున్నారని, ఎన్నికల కమిషన్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా సీఐడీ, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కేంద్రానికి రాసిన లేఖ..
ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం సహాయ కార్యదర్శి సాంబమూర్తి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటినీ ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొద్దిసేపటి కిందటే విచారణను ముగించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉద్యోగులపై కొనసాగుతోన్న సీఐడీ విచారణపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను నిలిపివేయాలని పేర్కొంది. తనను తొలగించడాన్ని తప్పు పడుతూ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏపీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
తదుపరి విచారణ నిలిపివేయాలంటూ..
ఆ లేఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైందని, ఆయన దాన్ని తెప్పించుకుని కేంద్రానికి పంపారంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. ఈ కేసు విచారణలో ఎన్నికల కమిషన్ సహాయ కార్యదర్శి సాంబమూర్తిని సీఐడీ అధికారులు విచారణకు పిలిపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి పంపిన లేఖ బయటికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఆయనే స్వయంగా రాశారా లేక ఎవరైనా పంపారా అనే కోణాల్లో సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఈ విచారణపై తాజాగా ఏపీ హైకోర్టు స్టే మంజూరు చేసింది.