ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్- కేంద్రం, సీబీఐతో పాటు16 మందికి నోటీసులిచ్చిన హైకోర్టు
ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విశాఖకు చెందిన నిమ్మీ గ్రేస్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా 16 మందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే విపక్ష టీడీపీ ఫోన్ ట్యాపింగ్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏపీలో విపక్ష నేతలు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మీ గ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని ఇప్పటికే రెండుసార్లు విచారించిన హైకోర్టు.. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్కు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన సీల్డ్ కవర్లో పూర్తి ఆధారాలు హైకోర్టుకు అందజేశారు.
దీనిపై స్పందించిన న్యాయస్ధానం ఇవాళ సీబీఐ, మొబైల్ ఆపరేటర్లతో పాటు మొత్తం 16 మందికి నోటీసులు పంపింది. హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మొబైల్ ఆపరేటర్లలో రిలయన్స్, జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్తో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఉన్నారు.
Recommended Video
వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున హోం, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలకూ, కేంద్ర విజిలెన్స్ కమిషన్కూ నోటీసులు వెళ్లాయి. అలాగే ఏపీ డీజీపీతో పాటు ప్రభుత్వశాఖలకూ నోటీసులు అందుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో కొందరు న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నట్లు పిల్ లో ఫిర్యాదు రావడంతో హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ జరుపుతోంది. అయితే ఇందులో హైకోర్టు సీబీఐకి కూడా నోటీసులు చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ కేసులో నాలుగు వారాల్లో పూర్తి వివరాలు అందజేయాలని వీరికి హైకోర్టు సూచించింది.