ఏపీ హైకోర్టుపై సోషల్ మీడియా కామెంట్స్: కొమ్మినేని సహా మరో 44 మందికి నోటీసులు
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడుతున్న తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాతో పాటు పలు ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అత్యున్నత న్యాయస్ధానం సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో 49 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తాజాగా మరో 44 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక, ప్రసార మాద్యమాల్లో అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఇవాళ సీఐడీ డీఎస్పీ రాధిక హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైకోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై న్యాయస్ధానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇప్పటికే నమోదైన కేసులతో పాటు మరో 44 మందికి కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం నోటీసులు పంపేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా జారీ చేస్తున్న 44 నోటీసులతో కలుపుకుంటే ఈ కేసులో మొత్తం 93 మందికి నోటీలు జారీ చేసినట్లు అవుతుంది.
Recommended Video
దేశంలో ఎక్కడా లేని విధంగా హైకోర్టు న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికార వైసీపీ మద్దతుదారులతో పాటు సాక్షి టీవీ ఎడిటర్ స్ధాయిలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుకు కూడా నోటీసులు జారీ అవుతుండటం కలకలం రేపుతోంది. ఈ పరంపర కొనసాగుతుండగానే తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతుండటం విశేషం.