హైకోర్టులో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ: వికేంద్రీకరణ బిల్లుపై 14వరకు స్టే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ గట్టిగా వాదించారు.
14వ తేదీకి వాయిదా..
పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 14వ తేదీకి వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు జూలై 31వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ పరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 14వ తేదీ వరకు స్టే కొనసాగుతోందని.. ధర్మాసనం స్పష్టంచేసింది.
విశాఖలో పాలన...
రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ అడుగులేస్తోంది. మెల్లగా కార్యాలయాలు కూడా తరలిస్తోంది. ఒక్కో జీవో రిలీజ్ చేస్తూ వ్యుహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు గత 200పై చిలుకు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. హైకోర్టులో కొందరు పిటిషన్ వేయగా.. ధర్మాసనం స్టే విధించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయామని..
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్ చేసి నష్టపోయామని.. ఇప్పుడు అమరావతిలో అభివృద్ది కేంద్రీకృతం కావొద్దని చెబుతూ వస్తోంది. దీనికి అనుగుణంగా తొలిసారి సీఎం జగన్ గతేడాది డిసెంబర్ 18వ తేదీన మూడు రాజధానులపై హింట్ ఇచ్చారు. రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పడంతో చర్చకు దారితీసింది. అప్పటినుంచి అమరావతి రైతులు ఆందోళన చేపడుతూనే ఉన్నారు. రెండురోజులకు అంటే డిసెంబర్ 20వ తేదీన జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని నివేదిక అందజేసింది. కమిటీ నివేదిక సీఎంకు ఎలా తెలుసు అని.. ముందే ఎలా చెబుతారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి.
కమిటీల నివేదిక..
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును కూడా నివేదిక కోరడంతో.. జనవరి 4వ తేదీన బీసీజే ప్రతినిధులు నివేదిక సమర్పించారు. వారు కూడా సేమ్.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందేనని.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. దీంతో అమరావతి రైతులు, ప్రతిపక్ష టీడీపీ, సీపీఎం ఆందోళన చేపట్టాయి. దీంతో మూడురాజధానులపై ప్రభుత్వం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో హై పవర్ కమిటీ వేసింది. కమిటీ కూడా అభివృద్ది వికేంద్రీకరణకే మొగ్గుచూపడంతో.. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును రూపొందించింది. జనవరిలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించగా అసెంబ్లీ.. ఆమోదం తెలిపింది. కానీ మండలి చైర్మన్ షరీఫ్ తన విచక్షణాధికారంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో కాస్త బ్రేక్ పడింది.
స్పెషల్ అసెంబ్లీ సెషన్..
జూన్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. జూన్ 16వ తేదీన అసెంబ్లీ ఆమోదించగా.. మండలిలో మాత్రం చర్చ జరగలేదు. ద్రవ్య వినిమయ బిల్లుపై కూడా చర్చ జరగకుండా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో జూలై 17వ తేదీన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ వద్దకు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
విచక్షణాధికారంతో ఆమోదం..
రెండుసార్లు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులు.. మండలి ఆమోదం పొందకుండా తనవద్దకు రావడంతో గవర్నర్ రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదుల సలహాలు తీసుకున్నారు. శ్రావణ శుక్రవారం జూలై 31వ తేదీన రెండు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. జగన్ ప్రభుత్వం అభీష్టం నెరవేరింది.