ఇళ్ల పట్టాలపై జగన్కు మరో ఎదురుదెబ్బ- వైశ్యసదన్ భూముల సేకరణపై హైకోర్టు స్టే...
ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం చేపట్టిన మరో భూసేరణ వ్యవహారంలో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల పంపిణీతో పాటు మరికొన్ని చోట్ల వివాదాస్పద భూములు సేకరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే క్రమంలో రాజమండ్రిలోని వైశ్య సదన్ భూముల సేకరణపై దాఖలైన పిటిషన్లోనూ హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగినట్లయింది.
రాజమండ్రిలోని వైశ్య సదన్కు చెందిన 32 ఎకరాల భూములను అధికారులు ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం సేకరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైశ్య సదన్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. వైశ్య సదన్ భూములను అధికారులు సేకరించకుండా స్టే విధించింది. దీంతో ఇదే జిల్లాలో మూడోసారి భూముల సేకరణపై హైకోర్టు స్టే ఇచ్చినట్లయింది. గతంలో మడ అడవులు, ఆవభూముల వ్యవహారాల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పలేదు.
రాష్ట్రంలో పలు చోట్ల 25 లక్షల మందికి ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ప్రైవేటు భూములను సేకరించడం మొదలుపెట్టారు. పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమైనా లెక్కచేయకుండా అధికారులు సేకరించడం మొదలుపెట్టారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలోనే మూడు చోట్ల సమస్యలు తలెత్తడంతో ఈ జిల్లాలో భూసేకరణ వ్యవహారం తీవ్ర విమర్శల పాలవుతోంది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.