ఏపీ హైకోర్టు జడ్జి ఫ్యామిలీ కరోనా శాంపిల్స్ మాయం- తీవ్ర కలకలం.. బయటపడ్డ నిర్లక్ష్యం..
ఏపీలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారీగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా.. మరోవైపు ఈ టెస్టుల నిర్వహణ ఆ తర్వాత శాంపిల్స్ తో ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యం ఒక్కసారిగా బయటపడింది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి కుటుంబానికి జరిపిన కరోనా టెస్టుల శాంపిల్స్ మాయమయ్యాయి. అసలే కరోనా వ్యాప్తి భయాలతో జనం భయభ్రాంతులవుతున్న వేళ ఈ శాంపిల్స్ ఎవరి చేతికి చిక్కుతాయో ఎవరికి కొత్తగా వైరస్ వ్యాపిస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
హైకోర్టు జడ్డి కరోనా శాంపిల్స్ మాయం...
ఏపీలో కరోనా పరీక్షల నిర్వహణ పేరు గొప్ప ఊరు దిబ్బగా మారుతోంది. ఇప్పటికే కరోనా పరీక్షల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, శాంపిల్స్ సేకరణ నాసిరకంగా ఉంటోందని, వాటిని భద్రపరచడంలోనూ నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తుండగా.. తాజాగా అవి వాస్తవమే అని నిరూపించే ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఎక్కడో సాధారణ ప్రజలకు సంబంధించింది కాదు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ కుటుంబం విషయంలోనే ఈ నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో వీఐపీలంతా హడలిపోతున్నారు.
అసలేం జరిగిందంటే..
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవాంద్, ఆయన సోదరుడు, ఐఏఎస్ అధికారి అంబేద్కర్, వారి కుటుంబ సభ్యులు 13 మంది నుంచి అధికారులు తాజాగా కరోనా శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ అయితే తీసుకున్నారు కానీ వాటిని భద్రపరచడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. దీంతో జడ్జి కుటుంబం శాంపిల్స్ మాయమయ్యాయి. దీంతో వీరి నుంచి మరోమారు శాంపిల్స్ సేకరించాల్సిన పరిస్దితి తలెత్తింది. రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తి కుటుంబం విషయంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక సామాన్యుల పరిస్ధితి ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.
శాంపిల్స్ నిర్వహణ విధానం ఇదీ...
సాధారణ జబ్బుల కోసం తీసుకునే శాంపిల్స్ నే ఆస్పత్రులు అన్ని జాగ్రత్తలు తీసుకుని భద్రపరచాల్సి ఉంటుంది. అది కరోనా అయితే మరిన్ని జాగ్రత్తలు అవసరం. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో లాక్ డౌన్ ఇంకా ముగియనే లేదు. అప్పుడే అధికారుల నిర్లక్ష్యం ఈ స్ధాయిలో ఉంటోంది. వాస్తవానికి కరోనా టెస్టులకు ముందు వారి ఆధార్ కార్డు, పేర్లు, ఇతర వివరాలను తీసుకుని వాటి డేటా భద్రపరిచిన తర్వాతే శాంపిల్స్ తీసుకోవాలి. తీసుకున్న శాంపిల్స్ ను ఈ డేటాతో కలిపి ప్రభుత్వం అనుమతించిన ల్యాబ్ లకు పంపించాలి. వాటికి పరీక్షలు పూర్తయ్యాక ఎవరికి ఏ రిజల్ట్ వచ్చిందో మొబైల్ ఫోన్ కు ఎస్మెమ్మెస్ లు కూడా పంపాల్సి ఉంది. కానీ జడ్జి కుటుంబం విషయంలో ఈ ప్రోసీజర్ అంతా పాటించలేదని అర్ధమవుతోంది.
రీ శాంపిల్స్ కోరిన అధికారులు..
హైకోర్టు జడ్జి కుటుంబం శాంపిల్స్ సేకరణలో తప్పిదాలు లేకపోయినా వాటిని భద్రపరిచే విషయంలో మెడికల్ సిబ్బంది చేసిన తప్పిదాల వల్ల ఇవి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఒకేసారి 13 మంది శాంపిల్స్ గల్లంతు కావడంతో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సైంటిస్ట్ డాక్టర్ ఆర్చన భరద్వాజ్ రీ శాంపిల్స్ కు సిఫార్సు చేశారు. దీంతో మరోసారి న్యాయమూర్తి కుటుంబం నుంచి శాంపిల్స్ సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కోవిడ్ 19 టెస్టుల వ్యవహారంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తీరు ఇలా వుంటే మిగిలిన రోగుల పట్ల వీరి తీరు ఎలా వుంటుందో అర్ధమవుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుండగా మెడికల్ సిబ్బంది కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.