అధికారమిచ్చారుగా.. ఏ పిటిషన్ అయినా వేస్తారు- జగన్ సర్కారుపై జస్టిస్ రాకేష్ కామెంట్స్
ఏపీ హైకోర్టు వర్సెస్ ప్రభుత్వంగా సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులతో పాటు ఇతర కేసుల్లోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నందున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ను సదరు కేసుల విచారణ నుంచి తప్పించాలని తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ల విచారణలోనూ పలు ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి.
ఇవాళ మరోసారి మిషన్ బిల్డ్ ఏపీ కేసుల విచారణలో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషన్లు విచారిస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ తనను తప్పించాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ముగింపు దశలో ఇలాంటి పిటిషన్ చూస్తానని అనుకోలేదన్నారు. రాగద్వేషాలు లేకుండా వ్యవస్ధ కోసం తుదికంటా పనిచేశానన్నారు. అధికారమిచ్చినందుకు ఏ పిటిషన్ అయినా వేస్తారని జగన్ సర్కారును ఉద్దేశించి రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు.
Recommended Video
మిషన్ బిల్డ్ ఏపీ పిటిషన్లపై ఇవాళ వాదనల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ను తప్పించాలనే ప్రభుత్వం కోరుతోంది. దీంతో ఈ నెల 28న పిటిషన్లు మరోసారి విచారణకు వచ్చే సందర్బంగా ఛీఫ్ జస్టిస్ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ రాకేష్ కుమార్ తెలిపారు. వాస్తవానికి జస్టిస్ రాకేష్ కుమార్ ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆ లోపు పలు కీలక కేసుల్లో తీర్పులు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.