హైకోర్టు జడ్డీల బదిలీలపైనా వైసీపీ వర్సెస్ టీడీపీ- మధ్యలో జగన్ సర్కార్- అదనపు ఏజీ క్లారిటీ!
దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని వేరే హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టులోనూ ఇద్దరు న్యాయమూర్తుల్ని బదిలీ చేసింది. అయితే అప్పటికే ఆ న్యాయమూర్తులు వెలువరించిన తీర్పులు, ఇచ్చిన ఆదేశాల ఆధారంగా లాయర్లు వారికి అనుకూల, ప్రతికూల పార్టీ వర్గాలుగా విడిపోయి నిరసనలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యలో వైసీపీ ప్రభుత్వం కూడా టార్గెట్ అవుతోంది. ఈ నేపథ్యంలో అదనపు ఏజీ క్లారిటీ ఇచ్చారు.
ఏపీ హైకోర్టు జడ్జీల బదిలీ
ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్ ను సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా బదిలీలు చేసింది. వీరిలో జస్టిస్ బట్టు దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై వారు మౌనంగానే ఉన్నారు. అయితే హైకోర్టులో లాయర్లు మాత్రం వీరి బదిలీల్ని నిరసిస్తూ నిన్న ఆందోళనకు దిగారు. జడ్జీల బదిలీల్లో వివక్ష చూపారంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇందులో పలు ట్విస్టులు చోటు చేసుకున్నాయి.
వైసీపీ, టీడీపీ వర్గాలుగా లాయర్ల చీలిక
అయితే హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపై తొలుత టీడీపీ అనుకూల వర్గంగా ఉన్న లాయర్లు ఆందోళనకు దిగారు. హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీలను ఆక్షేపిస్తూ హైకోర్టు ప్రాంగణంలోనే విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తి బదిలీని సైతం లాయర్ల ఆందోళనతో కొలీజియం వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తుచేసారు. అయితే వీరితో కొందరు లాయర్లు విభేదించారు. కొలీజియం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం సరికాదని వారితో వాదించారు. వీరు వైసీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. దీంతో లాయర్లలో హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపైనా చీలిక కనిపించింది.
మధ్యలో వైసీపీ సర్కార్
మరోవైపు ఈ వివాదంలోకి వైసీపీ సర్కార్ ను కూడా వీరు లాగారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాల్ని తప్పుబట్టిన హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదులు చేసి బదిలీ చేయించిందని టీడీపీ అనుకూల లాయర్లు వాదించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తప్పుచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని సైతం కోర్టు ముందు నిలబెట్టిన జస్టిస్ బట్టు దేవానంద్ పై కక్షపూరితంగానే ప్రభుత్వం ఫిర్యాదులు చేసిందని వారు ఆరోపించారు.
దీంతో ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. గతంలో జస్టిస్ బట్టు దేవానంద్ ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు, వ్యాఖ్యలు చూస్తే ఈ వాదనకు బలం చేకూరుతుంది.
సర్కార్ కు సంబంధం లేదన్న అదనపు ఏజీ
మరోవైపు టీడీపీ అనుకూల లాయర్ల వాదనను వైసీపీ అనుకూల వర్గంగా ఉన్న లాయర్లు ఖండించారు. జడ్జీల బదిలీల్ని వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. జడ్జీలకు కుల,మతాలు ఆపాదించడాన్నీ తప్పుబట్టారు. కొలీజియం నిర్ణయం మేరకే బదిలీలు ఉంటాయని, ఇందులో జగన్ సర్కార్ పాత్రేమీ ఉండబోదన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం ఇదే విషయం చెప్పారు. కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను గర్హిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద జడ్జీల బదిలీలపై నిరసనలు సైతం రాజకీయ రంగు పులుముకోవడం ఇదే తొలిసారి.