BIGG BOSS Telugu : బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏపీ హైకోర్టు సలహా ఇదే..!
ఏపీలో స్టార్ మాటీవీ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో అసభ్యత ఎక్కువైందని, ఇదో బ్రోతల్ హౌస్ గా మారిపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇవే కారణాలతో ఇంకొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. .తాజాగా ప్రేక్షకులకు ఆసక్తికరమైన సలహా ఇచ్చింది.
బిగ్ బాస్ షోలో ఆశ్లీలత
స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో ఆశ్లీలత శృతి మించిపోతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో పాల్గొంటున్న వారు ధరిస్తున్న దుస్తుల దగ్గరి నుంచి మాట్లాడే మాటలు, డ్యాన్సులు, పోటీలు ఇలా ఏ రకంగా చూసినా ఆశ్లీలత కనిపిస్తోందని విమర్శించే వారు ఎక్కువయ్యారు.
దీంతో బిగ్ బాస్ షోను నిషేధించాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ షోపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా దానికి రేటింగ్స్ మాత్రం బాగానే వస్తుండటంతో స్టార్ మా వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఇలా అభ్యంతరాలు చెబుతున్న వారు హైకోర్టును ఆశ్రయించారు.
బిగ్ బాస్ పై హైకోర్టు విచారణ
బిగ్ బాస్ షోలో ఆశ్లీలం ఎక్కువగా ఉంది కాబట్టి, దాని వల్ల ప్రజలపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ షోను నిషేధించాలంటూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు ఆయన దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. స్టార్ మాతో పాటు ఈ షో ను నిర్వహిస్తున్న నాగార్జున, ఇతరులకూ నోటీసులు ఇచ్చింది. తాజా విచారణలో వాద, ప్రతివాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అభ్యంతరాలుంటే చూడొద్దు..!
బిగ్ బాస్ రియాల్టీ షోను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరేం మాట్లాడాలో చెప్పేపని కోర్టులది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
బిగ్ బాస్ షోలను మించిన అశ్లీల కంటెంట్ ఇతర వేదికల్లో అందుబాటులోనే ఉందని తెలిపింది. అలాగే అభ్యంతరాలుంటే చూడొద్దని ప్రేక్షకులను ఉద్దేశించి హైకోర్టు సలహా ఇచ్చింది. అదే సమయంలో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించే బదులు వారికి ఉన్న అభ్యంతరాలపై వివిధ ప్రత్యామ్నాయ వేదికల్ని ఆశ్రయించే అవకాశం ఉందని స్టార్ మా పేర్కొంది. దీంతో ఆ వివరాలు కోరింది.