జగన్ కు 41 మంది సలహాదారులా ? ఆర్ధిక పరిస్ధితి చూడరా ? కేవీపీతో పోలుస్తూ హైకోర్టు చురకలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కు భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమించారు. వీరంతా వివిధ రంగాల్లో సీఎం జగన్ కూ, ప్రభుత్వానికీ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించారు. కానీ వారి సలహాల్ని జగన్ తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ తాజాగా హైకోర్టు మాత్రం ఇంత భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమించడంపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతే కాదు వీరికి చెల్లించే జీతభత్యాల వల్ల రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని కూడా ప్రశ్నించింది.
జగన్ సలహాదారులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అవసరాల కోసం అన్నట్లుగా 41 మంది సలహాదారుల్ని నియమించారు. వీరిలో కొందరు సచివాలయం నుంచి మిగతా వారు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ నుంచి సీఎం జగన్ కు సూచనలు, సలహాలు అందించాల్సి ఉంటుంది. వీరందరికీ దాదాపు రూ.2 లక్షల రూపాయల వేతనాన్ని కూడా ఇస్తున్నారు. వీరి కోసం కారు, ఆఫీసు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. వీరి నియామకంపై గతంలోనే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు హైకోర్టు కూడా వీరిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
జగన్ కు 41 మంది సలహాదారులెందుకు?
సీఎం జగన్ కు నియమించిన 41 మంది సలహాదారులపై హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. అంతమంది సలహాదారులు ఎందుకని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా సలహాదారుల జీతభత్యాలు, ఇతర వ్యవహారాల గురించి కూడా న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టేలా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ వివిధ రంగాల్లో నిష్టాతులైన వారిని సలహాదారులుగా నియమించామని, వీరి అర్హతలపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు.
సజ్జలను కేవీపీతో పోలుస్తూ చురకలు
సీఎం జగన్ సలహాదారుల్ని గతంలో మాజీ సీఎం వైఎస్సార్ కు సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్రరావుతో హైకోర్టు పోల్చింది. ప్రజాభద్రతా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ సలహాదారులకు రాజకీయ వ్యాఖ్యలెందుకని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఇలాంటి పరిస్ధితి లేదని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ మరణం నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు మాత్రమే అప్పటి ప్రజాభద్రతా సలహాదారు కేవీపీ రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ఇప్పుడు సలహాదారులు మాత్రం అలా లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Recommended Video
ఆర్ధిక పరిస్ధితి చూడరా ?
ప్రభుత్వం సీఎం జగన్ సలహాదారులకు చెల్లిస్తున్న జీత భత్యాల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని చూడరా అని ప్రశ్నించింది. ఇంత భారీ ఎత్తున సలహాదారుల నియామకం వల్ల రాష్ట ఆర్ధిక పరిస్ధితిపై పడే ప్రభావం గమనించరా అని హైకోర్టు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది. తద్వారా రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఇంత మంది సలహాదారుల నియామకం అవసరమా అనేలా హైకోర్టు ప్రశ్నలున్నాయి. దీంతో వీరి సంఖ్యతో పాటు ఇతర అంశాలపై ఇప్పటివరకూ ఎలాంటి నిబంధనలు లేవని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు.