జగన్ సర్కారుకు మరో షాక్- ఇళ్ల పట్టాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీలో నవరత్నాల పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని వైసీపీ సర్కారు ఏ క్షణాన నిర్ణయించిందో కానీ అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇళ్ల స్ధలాల సేకరణలోనే ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ నిర్ణయం, ఆ తర్వాత న్యాయస్ధానాల్లో విచారణతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమరావతితో పాటు పలు చోట్ల ఇళ్ల స్ధలాల కేటాయింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టగా... తాజాగా మరోసారి హైకోర్టు ఈ వ్యవహారంలో మరో మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
విశాఖ జిల్లా తిరుమల గిరి గిరిజిన పాఠశాల స్ధలాన్ని ఇళ్ల పట్టాలకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించింది. వాద, ప్రతివాదనల తర్వాత విద్యాసంస్ధల స్ధలాల్లో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చివరికి ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన స్ధలాల్లో ఇళ్ల స్ధలాలు ఇవ్వొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది.
ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపే హైకోర్టు నుంచి వెలువడుతున్న వరుస ఉత్తర్వులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. న్యాయ సమస్యలను అధిగమించలేకపోతే మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదు.