ఏపీలో సంక్రాంతి కోడి పందాలకు బ్రేక్-మరోసారి హైకోర్టు ఆదేశాలు
ఏపీలో ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా పలు జిల్లాల్లో నిర్వహించే సంక్రాంతి కోడి పందాలకు ఈ సారి కూడా బ్రేక్ పడేలా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై న్యాయస్ధానం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం.
Recommended Video
ఏపీలో సంక్రాంతి కోడి పందాలు దేశంలోనే ప్రత్యేక స్ధానం ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలకు ఎక్కడెక్కడి నుంచో జనం తరలివస్తుంటారు. పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన వారు కూడా గోదావరి జిల్లాలకు ఈ సీజన్లో వాలిపోతుంటారు. అయితే కోడి పందాల్లో జరిగే బెట్టింగ్ కారణంగా కుటుంబాలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయనే ఆరోపణలు గతం నుంచీ ఉన్నవే. ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలతో దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు కోడి పందాలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
గతేడాది సంక్రాంతి కోడి పందాలు అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి ఏమాత్రం అమలు కాలేదంటూ దాఖలైన పిటిషన్లు గతంలో విచారించిన న్యాయస్ధానం అధికారులను వివరణ కోరింది. ఇప్పుడు తాజాగా కోడి పందాలు జరగకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు గతంలో దాఖలైన పిటిషన్లను కూడా కలిపి విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. అయితే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ఏమాత్రం పాటిస్తారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
వాస్తవానికి హైకోర్టు ఆదేశాలకు ముందే గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సంక్రాంతి కోళ్లు, బరులు సిద్ధమైపోయాయి. కోడి పందాలు నిర్వహించడమే తరువాయి అన్నట్లుగా అక్కడ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే పందాల కోసం కోళ్లను సిద్ధం చేసుకున్న వాటి యజమానులు సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు, న్యాయస్ధాలు ఎన్ని ఆంక్షలు విధించినా తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న కోడి పందాలను తాము వదులుకునేది లేదని కోళ్ల యజమానులు, పందాల నిర్వాహకులు చెప్తున్నారు.