ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం- జస్టిస్ ఈశ్వరయ్యపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ..
ఏపీ న్యాయవ్యవస్ధలో తీవ్ర కలకలం రేపుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్ధపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబుతున్న వ్యాఖ్యలపై నిజ నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన మరో జడ్జి రామకృష్ణను తన వద్ద ఉన్న సాక్ష్యాలను విచారణలో అందించాలని, ఇందుకు అవసరమైతే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని సూచించింది.
ఏపీ హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని కరోనా కేసుల దృష్ట్యా రెడ్జోన్గా ప్రకటించాలని, కరోనా ప్రబలుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జస్టిస్ ఈశ్వరయ్య న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతికీ లేఖలు రాశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మృతినీ ఇందులో ప్రసావించారు. ఇదే అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధి సమాఖ్య సభ్యుడి లక్ష్మీనర్సయ్య హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన జడ్జి రామకృష్ణతో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్లో మాట్లాడి బెదిరించినట్లు ఱరోపణలు వచ్చాయి. ఈ సమయంలో న్యాయమూర్తులపైనా ఆయన ఆరోపణలు చేసినట్లు రామకృష్ణ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది.
జస్టిస్ ఈశ్వరయ్య న్యాయవ్యవస్దపై చేశారని చెబుతున్న ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు ఉన్న పెన్డ్రైవ్ను జడ్జి రామకృష్ణ హైకోర్టుకు అందించారు. దీనిపై నిజ నిర్ధారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.