హైకోర్టు సంచలన నిర్ణయం- ఇద్దరు ఏపీ ఏఐఎస్లకు జైలుశిక్ష- తర్వాత నిలిపివేత
ఏపీ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ ఏఐఎస్ అధికారులకు వారం రోజుల జైలుశిక్ష విధిస్తూ ఉన్నత న్యాయస్ధానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాము చేసిన ఆదేశాల అమలులో విఫలం కావడంతో హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఏపీ క్యాడర్కు చెందిన ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు గిరిజాశంకర్, చిరంజీవి చౌదరికి హైకోర్టు వారం రోజుల జైలుశిక్ష విధించింది. వీరిలో గిరిజాశంకర్ ఐఏఎస్ కాగా.. చిరంజీవి చౌదరి ఏఐఎస్ అధికారి. ఈ ఏడాది ఏప్రిల్లో 36 మంది ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. అప్పటి నుంచి వారిని క్రమబద్ధీకరించకపోవడంతో తమ ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు హైకోర్టు సూచించింది. అయినా తమ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో హైకోర్టు ఇవాళ తీవ్ర చర్యలకు దిగింది.
ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కొంటున్న ఐఏఎస్లు గిరిజాశంకర్, చిరంజీవి చౌదరి ఇవాళ విచారణకు హాజరయ్యారు. దీంతో వీరికి వారం రోజుల జైలుశిక్ష విధిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. గతంలో తాము చేసిన ఉత్తర్వులు అమలుకాకపోవడంతో కోర్టు ధిక్కార చర్యల కింద వీరికి జైలుశిక్ష విధిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని ఇద్దరు అధికారులు హామీ ఇవ్వడంతో హైకోర్టు ఈ జైలు శిక్ష అమలును నిలిపివేసింది.