డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు- ఆస్పత్రిలోనే వాంగ్మూలం
విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డాక్టర్ సుధాకర్ సమాజంలో తన హోదాను మర్చిపోయి బహిరంగంగా ముఖ్యమంత్రి, ప్రధాని మంత్రిని, అడ్డొచ్చిన పోలీసులను దుర్భాషలాడినట్లు పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ముందుగా ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విశాఖ సెషన్స్ న్యాయమూర్తిని రేపు సాయంత్రం లోపు సుధాకర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది.
విశాఖ నగరంలో లాక్ డౌన్ అమలవుతుండగానే మద్యం సేవించి ఓ కారులో వచ్చి రోడ్డుపై తనను అడ్డుకున్న పోలీసులపై దుర్భాషలాడినట్లు డాక్టర్ సుధాకర్ పై కేసులు నమోదయ్యాయి. పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు డా సుధాకర్ పై 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందే ఆయన మానసిక పరిస్ధితి సరిగా లేదన్న కారణంతో అధికారులు విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.