యరపతినేని వ్యవహారం ఇక ప్రభుత్వం చేతిలో : సీబీఐ ఉచ్చులో చిక్కినట్లే .. ఈడీ సైతం ఎంట్రీ.. !!
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సీఐడీ విచారణలో యరపతినేని అక్రమాలపై సాక్ష్యులు కీలక విషయాలు వెల్లడించారని, అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ నివేదిక ద్వారా అర్థమవుతోందని హైకోర్టు పేర్కొంది. యరపతినేనికి సంబంధించిన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్లు అనుమానాలున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చిక్కుల్లో టీడీపీ కీలక నేత..
అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ యరపతినేనిపై హైకోర్టుకు సీఐడీ నివేదికను సమర్పించింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు యరపతినేని మీద సీఐడీ విచారణ సాగింది. దీనికి సంబంధంచిన నివేదిక ను సీఐడీ హైకోర్టు సమర్పించింది. అందులో అక్రమ మైనింగ్ తో పాటుగా ఆంధ్రా బ్యాంకులో అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. అయితే, సీబీఐ విచారణకు వెళ్లే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. పల్నాడు ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. దీని పైన కోర్టులో దాఖలైన కేసు ఆధారంగా సీఐడీ విచారణకు ఆదేశించింది. యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారం అప్పట్లో రాజకీయంగానూ సంచలనంగా మారింది. దీని పైన వైసీపీ నిజ నిర్దారణ కమిటీ పేరుతో గనుల వద్ద పర్యటన చేసింది. అయితే, టీడీపీ గత ఎన్నికల్లో ఓడటంతో అక్కడ ప్రస్తుతం పూర్తిగా మైనింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం యరపతినేని అక్రమ మైనింగ్ వ్యవహారం ఏపీ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది.
అక్రమంగా గనులు తవ్వేసారు..
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమంగా గనులు తవ్వేసారంటూ సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. అనేక బ్యాంకు ఖాతాలా ద్వారా యరపతినేని లావాదేవీలను గుర్తించినట్లు నివేదికలో వివరించింది. అక్రమంగా గనుల తవ్వకం కేసులో చాలా తీవ్రత ఉందని.., ఈడీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ తన నివేదికలో కోర్టుకు నివేదించింది. తమ విచారణలో భాగంగా 24 మంది సాక్షులను విచారిస్తే వారంతా యరపతినేని అక్రమంగా గనులు తవ్వారని తేలిందని నివేదికలో స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు లావా దేవీలు చేతులు మారాయని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. సరైన విచారణ మొదలయ్యేంతవరకూ కూడా భారీ ఎత్తున ఖనిజాన్ని దోచుకున్నారని వివరించింది. అక్రమంగా గనుల తవ్వకంలో యరపతినేని వ్యవస్థీకృతమైన అండదండలు లభించాయన వాదనల్లో చెప్పింది. అప్పటి ప్రభుత్వం ఒక పెద్ద అధికార శక్తిగా యరపతినేని వ్యవహరించారని.. అందుకనే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రభుత్వం వాదనలు కొనసాగించింది.
నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే...
ఇక, ఇప్పుడు ఈ కేసును సీబీఐ కి అప్పగించాలా లేదా అనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరి తెలిపాలంటూ బుధవారానికి కేసు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..ఇప్పుడు యరపతినేని వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. తాజా ఎన్నికల్లో గురజాల నుండి పోటీ చేసి యరపతినేని ఓడిపోయారు. అప్పటి నుండి దాదాపుగా పార్టీ కార్యక్రమాలకు..రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యలో బీజేపీలో చేరుతున్నారనే ప్రచారమూ సాగింది. అయితే, ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించాల లేదా అనేది ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి కోర్టు వదిలేయటం..మధ్యలో ఒక్క రోజు మాత్రమే సమయం ఇవ్వటంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.