జగన్ సర్కారుకు హైకోర్టు మరో షాక్.. స్థానిక రిజర్వేషన్ల జీవో కొట్టివేత.. ఇప్పట్లో ఎన్నికలు కష్టమే..
ఏపీలో వైసీపీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులు, హైకోర్టు తరలింపు, విశాఖలో చంద్రబాబుపై దాడి తదితర అంశాల్లో సర్కారును తప్పుపట్టిన హైకోర్టు.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది.
వైఎస్సార్ను రిలయన్స్ చంపించిందని.. అంబానీతో సీఎం జగన్ మంతనాలు.. ఏపీలో హాట్ టాపిక్ ఇదే..
50 శాతం దాటొద్దు..
రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గత ఉత్తర్వుల్ని ఉంటంకిస్తూ ఏపీ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఏపీ స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ కుదరదని, కచ్చితంగా 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలని, ఆ మేరకు సవరణలతో మరో జీవో ఇచ్చుకోండంటూ సర్కారును కోర్టు ఆదేశించింది. కీలకమైన బీసీ రిజర్వేషన్లపైనా కోర్టు తన అభిప్రాయం తెలిపింది..
బీసీ రిజర్వేషన్లను తేల్చండి..
ఏపీ జనాభాలో 70 శాతం మంది బీసీలే కావడంతో స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్లు పెంచుతూ జగన్ సర్కారు మొత్తం రిజర్వేషన్లను 59.85కు పెంచింది. కానీ సదరు 59.85 శాతం రిజర్వేషన్లు జీవోను హైకోర్టు కొట్టసింది. రిజర్వేషన్లను 50 శాతంలోపే ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పులకు అనుగుణంగా 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండాలని.. ఆ 50 శాతంలో బీసీల కోటా ఎంత అనేది ప్రభుత్వం నెల రోజుల్లోగా డిసైడ్ చేయాలని కోర్టు సూచించింది.
ఎన్నికలు వాయిదా?
జీవోకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు రావడంతో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయం తప్ప వైసీపీ ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లను 59.85 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలంటే.. ఏయే వర్గాల కోటాను ఎంతెంత తగ్గించాలనేది గంటల వ్యవధిలో తేలే అంశం కాదన్నది తెలిసిందే. పైగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, టెన్త్, ఇంటర్ పరీక్షల హడావుడి నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడొచ్చని ముందునుంచే ప్రచారం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కోర్టు 30 రోజుల గడువిచ్చిన నేపథ్యంలో వాయిదా తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Recommended Video
సుప్రీంకు సీఎం జగన్?
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి తాము జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేవు. రిజర్వేషన్లు 50 శాతానికి దాటొద్దని చెప్పిందే సుప్రీంకోర్టు కాబట్టి అక్కడ కూడా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. కానీ రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలన్న వాదనను మరోసారి బలంగా వినిపించినట్లవుతుంది. ఇప్పటికే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు స్థానిక రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో పోరాడుతున్న సంగతి తెలిసిందే.