టీడీపీ మాజీమంత్రి కుమారుడికి ఏపీ హైకోర్టు షాక్: ఇక అరెస్టు తప్పనట్టే: గాలిస్తోన్న ఏసీబీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్ను ఏపీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. పితాని సురేష్.. కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈఎఎస్ఐ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఈ కుంభకోణంలో అరెస్టు అవుతానని ముందే గ్రహించిన ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 9వ తేదీన ఆయన ఈ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణను చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మధ్యాహ్నం ఈ తీర్పును వినిపించింది. పితాని సురేష్ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టేస్తున్నట్లు స్పష్టం చేసింది. అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ను మంజూరు చేయలేమని పేర్కొంది.
ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ను దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్ను దాఖలు చేసిన మరుసటి రోజే మురళీ మోహన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఇక పితాని సురేష్ అరెస్టు కావడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టేయడంతో అరెస్టు తప్పదని అంటున్నారు.
Recommended Video
ఈ పిటీషన్ను దాఖలు చేసినప్పటి నుంచి సురేష్ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ ఉన్నారనేది తెలియరావట్లేదు. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోందని ఇదివరకే ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఈఎస్ఐ స్కామ్లో ఇప్పటికే టీడీపీ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సహా పలువురు అరెస్టు అయ్యారు.