జగన్కు గ్రేట్ రిలీఫ్: అర్దరాత్రి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు : ఇక ముందుకే..!
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి జగన్కు రిలీఫ్ దొరికింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రజావేదిక కూల్చివేత పైన ఏపీ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగుతున్న సమయంలో అర్దరాత్రి 2.30 గంటలు దాటిన తరువాత ఈ పిటీషన్ పైన విచారణ సాగింది. అయితే, ఈ వ్యహారం పైన సుదీర్ఘ వాదనలు విన్న ఏపీ హైకోర్టు కూల్చివేత నిలుపుదల ఉత్తర్వులకు నిరాకరిస్తూ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.
కొనసాగుతున్న కూల్చివేత..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో నాటి ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి రాజధాని వ్యవహారం లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్..ఇప్పుడు నేరుగా కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదిక అక్రమంగా నిర్మించారని ..దీనితోనే అక్రమాల కూల్చివేత ప్రారంభించాలని జగన్ ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. ఒక వైపు వర్షం కురుస్తుండగానే.. మరో వైపు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న రాజధాని ప్రాధికారిక సంస్థ అధికారులు..కూల్చివేత సిబ్బంది..పోలీసులు అక్కడ మొహరించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికాబద్దంగా కూల్చివేత ప్రారంభించారు. తాజ సమాచారం మేరకు ఇంకా కూల్చివేత పని కొనసాగుతూనే ఉంది.
చంద్రబాబు ఇంటి..కంటి ముందే..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. తాను ఉంటున్న నివాసానికి సమీపంలోనే నాటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రిగా తాను సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండటానికి..అదే విధంగా అధికారిక కార్యకలాపాల కోసం ఈ వేదిక నిర్మించాలని భావించారు. అదే విధంగా దాదాపు మూడేళ్లుగా ఈ భవనం ఉపయోగించుకున్నారు. సరిగ్గా చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని తన నివాసానికి అర్దరాత్రి చేరుకున్నారు. ఆ సమయానికి ప్రజా వేదిక కూల్చివేత కొనసాగుతోంది. దాని ముందుగానే మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లారు. ఇక, ఈ రోజు పార్టీ నేతలతో ఇదే అంశం పైన చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పటికే ప్రజా వేదిక కూల్చివేత పూర్తి కావచ్చింది. దీంతో..ఇక టీడీపీ నేతలు సైతం ప్రజా వేదిక విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. దీంతో..అర్దరాత్రి అత్యవసర కేసు కింద ఇదే అంశం పైన హైకోర్టను ఆశ్రయించారు.
స్టేకు హైకోర్టు నిరాకరణ..
ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలైంది. దీని పైన అర్దరాత్రి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కూల్చివేత పైన ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనికి సంబంధించి కూల్చివేత నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.ఈ పిల్ పైన అర్దరాత్ర 2.30 గంటల తరువాత విచారణ సాగించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేసారు. కూల్చివేత కారణంగా ప్రజాధనం వృధా అవుతోందని..దీని పైన ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే కూల్చివేత పైన నిర్ణయం తీసుకోవాలని పిటీషనర్ కోరారు.అక్రమ కట్టడాల కూల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలని, అలాంటి ఉత్తర్వులేవీ లేకుండా కూల్చుతున్నారన్నారు. రూ.8.9కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలో ఓశాఖ నిర్మించిన ప్రజావేదికను మరో శాఖ అక్రమమని భావిస్తే వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, కోర్టు స్టేకు నిరాకరించటంతో..జగన్ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దొరికింది.