జగన్ సర్కారుకు మరో షాక్- స్ధానిక ఎన్నికల వాయిదాపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టులో ఇవాళ మరోసారి మద్దతు లభించింది. కరోనా పేరుతో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యంగా పిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని ప్రభుత్వం చేసిన వినతిని హైకోర్టు అంగీకరించలేదు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
Recommended Video
ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్ తిప్పికొట్టారు. ఇప్పటికే మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. నిజంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టులో కేసు వేశారని తెలిపారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది డిఫెన్స్లో పడ్డారు. దీనిపై వాదనలు వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.