మున్సిపల్ ఎన్నికలపై ఎటూ తేల్చని హైకోర్టు- రేపటికి తీర్పు రిజర్వ్- పార్టీల్లో ఉత్కంఠ
ఏపీలో పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలను వచ్చే నెల 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రీ షెడ్యూల్ ఇచ్చినా దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. ఎస్ఈసీకి గతంలో ఆగిన ఎన్నికలను తిరిగి కొనసాగించే అధికారం లేదంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు వెలువడే తీర్పు ఎన్నికల భవిష్యత్తుకు నిర్ణయించబోతోంది.
మున్సిపల్ పోరుపై అదే ఉత్కంఠ
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు గతంలో వాయిదా పడిన దగ్గర నుంచి జరుగుతాయా లేక తిరిగి కొత్తగా నోటిఫికేషన్ విడుదలవుతుందా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. వచ్చే నెల 2 నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియను గతంలో వాయిదా పడిన దగ్గర నుంచి ప్రారంభించేందుకు వీలుగా ఎస్ఈసీ ఇచ్చిన రీ షెడ్యూల్పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతోంది. గతంలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది కాలంలో కొందరు అభ్యర్ధులు చనిపోయారు. మరికొందరికి నామినేషన్ అవకాశం లేకుండా పోయింది. దీంతో వీరంతా ఇప్పుడు కోర్టును కొత్త నోటిఫికేషన్ కావాలని అభ్యర్ధిస్తున్నారు.
హైకోర్టులో ముగిసిన విచారణ
ఏపీలో గతంలో ఆగిన చోట నుంచి మున్సిపల్ ఎన్నికలను తిరిగి నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును వాయిదా వేసింది. ఇందులో అభ్యర్ధులు గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరిగితే తాము అవకాశాలు కోల్పోతామంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కానీ సమయాభావం వల్ల ఎన్నికల ప్రక్రియ అక్కడి నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు దీనిపై ఎటూ తేల్చకుండా తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ఎస్ఈసీ అధికారాలపైనే చర్చ
రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రంలో స్ధానిక సంస్ధలు ఏదైనా కారణంతో వాయిదా పడితే గరిష్టంగా ఆరునెలల్లోపు తిరిగి నిర్వహించేటప్పుడు గతంలో జరిగిన ప్రక్రియను కొనసాగించేందుకు వీలుంది. కానీ ఇక్కడ ఏడాది కావస్తోంది. అయినా ఎన్నికల ప్రక్రియను తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టాలని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపైనే హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే కరోనా సమయాన్ని ఇతర కారణాలతో ముడిపెట్టడం సమంజసం కాదని ఎస్ఈసీ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై హైకోర్టు ఇచ్చే తీర్పు ఉత్కంఠ రేపుతోంది.
ఎన్నికల రీ నోటిఫికేషన్ తప్పదా ?
మున్సిపల్ ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచి తిరిగి కొనసాగించే విషయంలో ఎస్ఈసీకి అధికారాలు లేకపోవడంతో ఇప్పుడు ఆయన జారీ చేసిన రీ షెడ్యూల్ చెల్లుబాటుపై హైకోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది. అయితే ఒకవేళ రాజ్యాంగబద్ధం కాని ఈ నిర్ణయం చెల్లదని హైకోర్టు తీర్పు చెబితే మున్నిపల్ ఎన్నికలకు తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పార్టీల తరఫున అభ్యర్ధులు మరోసారి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. స్వతంత్రులకూ అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున హైకోర్టు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.