ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు... డివిజన్ బెంచ్లో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. అటు ప్రభుత్వం,ఇటు ఎస్ఈసీ తరుపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్ఈసీ పిటిషన్పై ప్రతివాదిగా ఇంప్లీడ్ అయ్యేందుకు ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాల తరుపున దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
Recommended Video
రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ రావు... ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అందులో జోక్యానికి తావు లేదన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్... కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు ఇచ్చిన వివరాలను ఎన్నికల కమిషనర్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్,ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు పెద్ద యుద్దమే జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా... ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాత్రం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం,ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
ఎన్నికల షెడ్యూల్ను ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్లో సవాల్ చేయడంతో... న్యాయస్థానం దాన్ని కొట్టిపారేసింది. ఆ తీర్పుతో ప్రభుత్వానిదే పైచేయిగా మారింది. అయితే నిమ్మగడ్డ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు.తాజాగా డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేయడంతో... అది ఎవరికి అనుకూలంగా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది.