డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు- సిబ్బంది తప్పులతోనే రప్పించాం- హైకోర్టు
ఏపీలో కింది స్ధాయి సిబ్బంది చేసిన ఓ తప్పిదం కారణంగా హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్ను న్యాయస్ధానంలో హాజరుకావాలని పిలిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇవాళ హైకోర్టులో హాజరు అయ్యారు. ఎస్ఐ రామారావు తనకు పదోన్నతి లో అన్యాయం జరిగిందని తనకు సిఐగా పదోన్నతి ఇవ్వకుండా తన జూనియర్లకు పదోన్నతి కల్పించారని గతంలో హై కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హై కోర్టు ఎస్ఐ రామారావుకు పదోన్నతి కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది.
అయితే కోర్టు ఆదేశాలను పోలీస్ శాఖ అధికారులు అమలు చేయలేదు. దీనితో కోర్టు ధిక్కార నేరం కింద ఎస్ఐ రామారావు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై డిజిపి గౌతం సవాంగ్ స్వయంగా కోర్టుకు వచ్చి సమాధనం ఇవ్వాలని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలమేరకు గౌతం సవాంగ్ హై కోర్టుకు హాజరు అయ్యారు.
రామారావుకు సిఐగా ఇటీవల పదోన్నతి ఇచ్చామని హైకోర్టుకు డీజీపీ సవాంగ్ తెలిపారు. అయితే పదోన్నతి ఎందుకు ఆలస్యమైందని హైకోర్టు ఆయన్ను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అడిగింది. తమ డిపార్మెంట్ అప్పీల్కు వెళ్లినందునే ఆలస్యం అయ్యిందని హైకోర్టుకు గౌతం సవాంగ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌతం సవాంగ్ నిజాయితీపడు, సమర్థుడైన అధికారే అని, క్రింది స్థాయి అధికారుల పొరపాట్ల వల్ల ఉన్నతాధికారులు కోర్టులకు రావలసి వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు సక్రమంగా పనిచేసేట్లు చేసుకోమని డీజీపీకి సూచించింది. తదుపరి విచారణకు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది.