మహిళను బూటుకాలుతో తంతరా: నోరు ఎందుకు నొక్కారు:హైకోర్టు ఆగ్రహం..!
అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు పైన ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించింది .మగ పోలీసులు మహిళలతో వ్యవహ రించిన తీరు పైన ప్రశ్నల వర్షం కురిపించింది. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వకేట్ జనరల్ దాదాపు గంట పాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. 144 సెక్షన్ను రాజధానిలో పొడిగించినట్టు వివరించారు.
144 సెక్షన్ ఎందుకు..
రాజధాని గ్రామాల్లో పోలీసులు విధించిన ఆంక్షల పైన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన కోర్టులో విచారణ ముగిసింది. సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 అమలు చేయడంపై రైతులతో పటుగా మహిళ లు..న్యాయవాదులు పిటీషన్లు దాఖలు చేసారు. దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. గతంలోనే ఈ సెక్షన్ అక్కడ అమల్లో ఉందని...దీనిని పొడిగించినట్లు వివరించారు.
శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే రైతులను అడ్డుకున్నట్టు ఏజీ తెలిపారు. అయితే, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 610 మందిపై కేసులు పెట్ట డంపైనా న్యాయమూర్తులు ఏజీని వివరణ అడిగారు.
కవాతు దేనికి..బూటు కాలుతో ఎందుకు తన్నారు..
ఇదే సమయంలో కోర్టు పోలీసుల తీరు పైన వచ్చిన ఫిర్యాదులు..పత్రికల్లో వచ్చిన ఫొటోలను సుమోటాగా విచారణకు స్వీకరించింది.610 మంది పైన కేసులు పెట్టటానికి కారణాలను ఏజీ చెప్పుకొచ్చారు. బెంజ్ సర్కిల్ వద్ద ర్యాలీకి వెళ్తున్నందునే అరెస్టు చేశామని ఆయన బదులిచ్చారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారని.. మందడంలో మహిళను పోలీసులు బూటు కాలుతో ఎందుకు తన్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆందోళనలో మహిళల నోరు ఎందుకు నొక్కారంటూ న్యాయమూర్తులు ఏజీని ప్రశ్నించారు. మగ పోలీసులు మహిళలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని నిలదీశారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే అమరావతిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమగ్రంగా ప్రమాణపత్రం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.